29-07-2025 12:03:55 AM
మహబూబాబాద్, జూలై 28 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో ప్రధాన రహదారిపై అనేకచోట్ల గుంతలు ఏర్పడి వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారిందని, వెంటనే రోడ్లపై ఏర్పడ్డ గుంతలను పూడ్చి రోడ్లకు మరమ్మత్తులు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు సోమవారం అంబేద్కర్ సెంటర్లో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేసముద్రం మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తున్నామని ప్రకటనలకు మాత్రమే పరిమితమయ్యారని, రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని, అడుగుకో గుంట ఏర్పడి వాహనాల రాకపోకలకు ఆటంకంగా మారిందని ఆరోపించారు.
రోడ్లపై ఏర్పడ్డ గుంటలను వెంటనే పూడ్చి, మెరుగైన రోడ్డు నిర్మించి ఇబ్బందులు తొలగించాలని డిమాండ్ చేశారు. మాజీ జడ్పిటిసి సభ్యుడు రావుల శ్రీనాథ్ రెడ్డి, నీలం దుర్గేష్, కమటం శ్రీనివాస్, గూగులోత్ వీరు నాయక్, రడం శ్రీనివాస్, సట్ల వెంకన్న, కొమ్ము రాహుల్, మోడం రవీందర్ గౌడ్, కొండ్రెడ్డి రవీందర్ రెడ్డి, రామడుగు ధర్మాచారి, నల్ల కిరణ్, గణపారపు రమేష్, ముత్యాల శివకుమార్, గొట్టం సుభాష్, భానోత్ వెంకన్న పాల్గొన్నారు.