21 May, 2026 | 1:47 AM

పట్టపగలు మహిళ దారుణ హత్య

22-09-2025 12:40 AM

తాండూరు (విజయ క్రాంతి) : వికారా బాద్ జిల్లా తాండూర్ పట్టణంలో పట్టపగలే ఆదివారం ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. స్థానికులు మృతురాలి బంధు వులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని వాల్మీకి నగర్ ప్రాంతానికి చెందిన పిచ్చకుంట్ల పద్మమ్మ(43) అనే మహిళ మల్లప్ప మడిగే సమీపంలో భర్త రాజుతో కలిసి పంది మాంసం విక్రయిస్తూ జీవనం కొనసాగిస్తుంది.

మధ్యాహ్నం సమయంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఒక్కసారిగా ఆమెపై కత్తితో దాడి చేశాడు. ఆమె అరుపులు విన్న స్థానికులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని తాండూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు.

అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. అయితే ఆమె శరీరంపై ఉన్న బంగారు నగలు కనిపించకపోవడంతో బంగారం కోసమే తెలిసినవారే హత్య చేసి ఉంటారని బంధువులు  అనుమానం వ్యక్తం చేస్తున్నారు.