calender_icon.png 24 February, 2026 | 5:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 20న బడ్జెట్

24-02-2026 01:51:11 AM

16 నుంచి 30 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

క్యాబినెట్ నిర్ణయాలు: వైద్య శాఖలో కీలక సంస్కరణలు

  1. ఆసుపత్రుల నిర్వహణకు కొత్త విధానాల అధ్యయనానికి మంత్రి రాజనర్సింహ అధ్యక్షతన కమిటీ
  2. వీలైనంత త్వరగా హైదరాబాద్ మెట్రో స్వాధీనం
  3. కేంద్రం భాగస్వామ్యంతో ఫేజ్ 2 విస్తరణ
  4. తెలంగాణ వైద్య విధాన పరిషత్ పేరును.. డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్‌గా మార్పు 
  5. మహబూబాబాద్‌లో జేఎన్టీయూ కాలేజీ నిర్మాణానికి 70 ఎకరాలు
  6. ఖమ్మంలో టీటీడీకి 20 ఎకరాలు
  7. కోహెడలో టీజీఐఐసీకి  223 ఎకరాల బదలాయింపు

హైదరాబాద్, ఫిబ్రవరి 23 (విజయక్రాంతి) : తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమా వేశాలకు ముహూర్తం ఖరారైంది. మార్చి 16 నుంచి 30 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని తెలంగాణ క్యాబినెట్ భేటీలో నిర్ణయించారు. 16న ఉభయ సభలనుద్దేశించి రాష్ట్ర గవర్నర్ ప్రసంగించను న్నారు. 20న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీలో.. శాసనసభా వ్యవహా రాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు శాసన మండలిలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సోమవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో క్యాబినెట్ సమావే శం జరిగింది. దాదాపు ఆరు గంటలపాటు జరిగిన ఈ క్యాబినెట్ సమావేశంలో  పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలను ప్రారంభించాలని నిర్ణయించారు.

వైద్య ఆరోగ్య శాఖలో కీలక సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ర్టంలో వివిధ విభాగాల పరిధిలో ఉన్న అన్ని ఆసుపత్రుల నిర్వహణ సమర్థవంతంగా జరిగేలా చర్యలు చేపట్టాలని చర్చించింది. ఇందుకు అవసరమైన కొత్త విధానాలపై అధ్యయనం చేసేందుకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ ఏర్పా టుచేయాలని మంత్రివర్గం నిర్ణయించింది.

ప్రభుత్వ సలహాదారు డాక్టర్ నోరి దత్తాత్రేయుడు, డాక్టర్ శ్రీనాథ్‌రెడ్డిని  కమిటీలో నియమించి వారి సలహాలు సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు. ఆసుపత్రుల నిర్వహణను పకడ్బందీగా చేపట్టేందుకు ఆసుపత్రుల్లో మెడికల్ సర్వీసెస్, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వేరుగా విభజించే ప్రత్యామ్నాయాలను కూడా పరిశీలించనున్నారు.  

మెరుగైన వైద్య సేవలు.. 

రాష్ట్ర ప్రజలకు ప్రభుత్వ  హాస్పిటళ్లలో మరింత మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ వైద్య విధాన పరిషతుత్‌ను  డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్‌గా మార్చాలని నిర్ణయించింది. డీఎస్‌హెచ్ బిల్లు ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. ఇన్నాళ్లు అటానమస్ వ్యవస్థగా ఉన్న టీవీవీపీకి, పూర్తిస్థాయి ప్రభుత్వ విభాగ హోదా లభిస్తుంది.

నిధుల కేటాయింపులో ప్రాధాన్యం పెరుగుతుంది. సర్జికల్స్, మెడిసిన్స్ కొనుగోలు వేగంగా జరుగుతుంది.  డాక్టర్లు, సిబ్బందికి సకాలంలో వేతనాలు అందడంతో వైద్య సేవలు మెరుగుపడుతాయి. 

క్యాబినెట్ నిర్ణయాలు 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో కాంప్రెహేన్సివ్ రోడ్ మెయిం టెనెన్స్ ప్రోగ్రామ్ చేపట్టేందుకు క్యాబినెట్ ఆమోద ం తెలిపింది. ఈ ప్రాజెక్టు ఫేస్ 1 లో ఉన్న 744 కిలోమీటర్లకు అదనంగా 300 కిలోమీటర్ల రోడ్లను ఫేస్ అభివృద్ధి, మెయింటెనెన్సు చేస్తారు. రూ. 3145 కోట్ల జీహెచ్ ఎంసీ నిధులతో ఈ ప్రాజెక్ట్ చేపట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోమంజీరా వాటర్ సప్లు స్కీమ్ ఫేస్ 1, ఫేస్ 2 ఆధునీకరణ ప్రాజెక్ట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. హైదరాబాద్ జల మండలి ప్రతిపాదనల మేరకు రూ. 722 కోట్ల తో  ఈ ప్రాజెక్ట్ పనులకు  నిర్ణయం తీసుకుంది. రూ. 282 కోట్లతో ఉస్మాన్ సాగర్ మంచినీటి పైప్ లైన్ ఆధునీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నారు,  కాలం చెల్లిన పైపులు. పంప్ హౌస్‌ల  కారణంగా దాదాపు 30 శాతం నీటి సరఫరాలో నష్టం వాటిల్లుతోందని,  ఇప్పుడున్న ప్రాజెక్టు ఆధునీకరిస్తే ఈ పరిస్థితి ఆదిగమించటంతో పాటు హైదరాబాద్ సిటీలో నీటి సరఫరా మెరుగు పడుతుంది. 

మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం గుమ్మడూరులో జేఎన్టీయూ అధ్వర్యంలోని ఇంజనీరింగ్ కాలేజీకి 70 ఎకరాలు, శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఇంజినీరింగ్ కాలేజీ నిర్మాణానికి సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం ఉమ్మాపూర్లో 36 ఎకరాలను కేటాయించింది.  

నల్గొండ, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, మెదక్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల్లో 21 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్స్ స్కూళ్ల నిర్మాణానికి భూములు కేటా యించింది. 

హైదరాబాద్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణాలకు అవసరమైన 42 ఎకరాలను రక్షణ శాఖ (ఢిపెన్స్ ల్యాండ్) నుంచి తీసుకున్నందున అందుకు సమాన విలువైన భూములను రక్షణ శాఖకు కాప్రా మండలంలో 153 ఎకరాలు కేటాయింపు.

భద్రాచలంలో గ్రీన్ఫీల్డ్ మినీ స్టేడియం నిర్మాణానికి 5 ఎకరాల భూమి, తిరుమల తిరుపతి దేవ స్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామి దివ్య క్షేత్రం నిర్మాణానికి ఖమ్మం అర్బన్ మండలం ధంసలాపురం గ్రామంలో 20 ఎకరాలు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండల కేంద్రంలో పంచముఖ ఆంజనేయ స్వామి ఆల యం నిర్మాణానికి 3 ఎకరాల 12 గుంటలను దేవాదాయ శాఖకు కేటాయింపు. వీణ పరిధిలోని నియోపోలీస్ పరిసర ప్రాంతాల్లో నీటి సరఫరాకు సంబంధించి మౌలిక వసతుల కల్పనకు గండిపేట మండలం కోకాపేటలో శారద పీఠానికి చెందిన స్థలాన్ని హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ అండ్ సీవరేజీ బోర్డుకు కేటాయించడం తో పాటు శారద పీఠానికి ప్రత్యామ్నాయ స్థలం కేటాయింపునకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

రంగారెడ్డి జిల్లా కోహెడలో  మల్టీ మోడల్ లాజిస్టిక్స్ పార్క్, ఫుడ్ ప్రాసెసింగ్ పార్క్ ఏర్పాటు చేయాలని, అందుకు అవసరమైన  223.09 ఎకరాల భూమిని టీజీఐఐసి బదలాయించాలని నిర్ణయం తీసుకుంది. టీజీ హౌసింగ్ బోర్డు ఆధీనంలో ఉన్న 239 ఎకరాలను ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన పండ్ల మార్కెట్ ఏర్పాటుకు వ్యవసాయ మార్కెటింగ్ విభాగానికి రాష్ట్ర క్యాబినెట్ కేటాయించింది.  

క్యూర్ ఏరియాలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గర నిర్మించిన షాప్స్ వేలం వేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతాల్లో స్పెషల్ డ్రైవ్ నిర్వహించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులను రాబట్టుకోవడానికి ప్రయత్నించాలని చర్చించింది.

క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా 300 మెగావాట్ల విద్యుత్తు వినియోగించే డేటా సెంటర్లకు రెన్యుబుల్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్  ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదించింది.  

కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన జనగణన 2027ను చేపట్టేందుకు రాష్ర్టంలో ప్రభుత్వం చేస్తున్న ఏర్పాట్లపై మంత్రివర్గం చర్చించింది. నిర్ణిత షెడ్యూల్ ప్రకారం తొలి విడత  జరిగే ఇండ్ల గణన (హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్) రాష్ర్టంలో మే 11వ తేదీన ప్రారంభించి జూన్ 9 వరకు చేపట్టేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. హౌజ్ లిస్టింగ్ కు కేంద్రం నిర్దేశించిన 34 ప్రశ్నల నమూనాను వివరించారు.

రాష్ర్టంలో ఎన్యుమరేటర్లతో పాటు నోడల్ ఆఫీసర్లు మొత్తం 89 వేల మంది ఉద్యోగులు జన గణన ప్రక్రియలో పాలుపంచుకుంటారు. రెండో దశ జన గణన ప్రక్రియ వచ్చే ఏడాది 2027 ఫిబ్రవరి లో చేపడుతారు.

ఉద్యోగులకు ప్రమాద బీమా పథకం

క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్

ప్రస్తుతం  రాష్ర్టంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు ప్రమాద బీమా పథకం అమలు చేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఉద్యోగులు ఒక్క రూపాయి ప్రీమియం కూడా చెల్లించకుండా దీనిని అమలు చేస్తారు. ఇప్పటికే సింగరేణిలో, ట్రాన్స్‌కోలో ఉద్యోగులకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పుడు రాష్ర్టంలోని ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లందరికి ఈ పథకాన్ని ప్రారంభిస్తుంది.

ఈ ప్రమాద బీమా అమలుతో.. ఒకవేళ ఎవరైనా  ప్రమాదంలో మరణిస్తే  రూ.1.2 కోట్లు ప్రమా ద బీమా పరిహారం అందుతుంది. సహజ మరణానికి 60 ఏళ్ల వరకు ఉద్యోగులకు రూ. 10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. రాష్ర్టంలో ప్రభుత్వ, ప్రభుత్వ కార్పొరేషన్లు. ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5 లక్షల 19 వేల మంది రెగ్యులర్ ఉద్యోగులు న్నారు. వీరితో పాటు 2 లక్షల 38 వేల మంది పెన్షనర్లు ఉన్నారు.

మొత్తం 7.57 లక్షల మందికి ఈ ప్రమాద బీమా వర్తిస్తుంది. అటు ఉద్యోగులు, ఇటు ప్రభుత్వంపై ఎలాంటి భారం లేకుండా బ్యాంకర్ల ద్వారా బీమా అమలుచేయాలని రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయించింది. ఉద్యోగుల ఆరోగ్య భద్రతకు క్యాష్ లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్  అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. 3 లక్షల 56 వేల మంది ప్రభు త్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పథకం వర్తిస్తుంది.

ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఆసుపత్రుల్లో ఒక్క రూపాయి చెల్లించకుండానే వైద్య చికిత్సలు అందుతాయి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 652 ఎంప్యానెల్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో ఈ పధకం వర్తిస్తుంది. దీనిపై మొత్తం 1998 వైద్య చికిత్సలు అందిస్తారు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ ఎంప్లాయీ కార్డ్ అందిస్తారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ ఉచిత నాణ్యమైన వైద్యం అందించాలని కేబినెట్ నిర్ణయించింది.

ఈ పధకానికి ప్రభుత్వ ఉద్యోగులు తమ బేసిక్ పే నుంచి 1.5 శాతం తమ వాటాగా చెల్లిస్తారు. అంతే సమాన వాటాను ప్రభుత్వం మ్యాచింగ్ వాటా చెల్లిస్తుంది. ఏడాదికి ఉద్యోగులు రూ. 528 కోట్లు తమ వాటాగా చెల్లిస్తే.. ప్రభుత్వం కూడా రూ. 528 కోట్లు వాటా చెల్లిస్తుంది. మొత్తం రూ.1056 కోట్లతో క్యాష్ లెస్ ఎంప్లాయి హెల్త్ స్కీమ్ అమలుచేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  

హెచ్‌ఎండీఏలోకి మరో నాలుగు గ్రామాలు..  

హెచ్‌ఎండీఏ విస్తరణలో భాగంగా మరో నాలుగు గ్రామాలను హెచ్‌ఎండిఎ పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వికారాబాద్ జిల్లా నవాబ్‌పేట్ మం డలంలోని చిట్టిగూడ, యావపూర్, మోమిన్‌పేట మండలం టేకులపల్లి, ఎంకతాల గ్రామాలను హెచ్‌ఎండీఏ పరిధిలో చేర్చారు.

45 నిమిషాల పాటు ఆలస్యంగా.. 

రాష్ట్ర మంత్రి వర్గ సమావేశానికి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గైర్వాజరయ్యారు. అనారోగ్య సమస్య ( వెన్ను నొప్పి )తో బాధపడుతున్నందున క్యాబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. అయితే ఉదయం 10:30 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డిని  జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. ఆనారోగ్య సమస్య ఉందని, అందుకు  క్యాబినెట్ సమావేశానికి హాజరుకాలేని పరిస్థితి ఉందని చెప్పారు.

ఆరోగ్యం కుదటపడితే క్యాబినెట్ భేటీకి హాజరవుతానని మంత్రి తుమ్మల చెప్పారు. దీంతో క్యాబినెట్ సమావేశం మంత్రి తుమ్మల కోసం  ముందుగా నిర్ణయించిన సమయానికి కంటే  45 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభమైంది. తుమ్మల రావడం లేదని తెలిసిన తర్వాత మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది.    

మెట్రో స్వాధీనం.. రెండో ఫేజ్ విస్తరణ..  

హైదరాబాద్ మెట్రోను ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతమున్న 69 కిలోమీటర్ల మెట్రో వ్యవస్థను ఎల్ అండ్ టీ కంపెనీ నుంచి పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. వెంటనే అందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ మెట్రో రైల్ స్వాధీనం, సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రభుత్వం నియమించిన క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదికపై కేబినేట్ సుదీర్ఘంగా చర్చించింది. అవసరమైతే రాబోయే అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చించాలని నిర్ణయం తీసుకుంది. 

మెట్రో ఫేజ్ విస్తరణ పనులను వేగంగా ప్రారంభించాలని మంత్రివర్గం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్లో చేపట్టే ఫేజ్-2 విస్తరణకు మొత్తం మెట్రో నెట్వర్క్ ఒకే సంస్థ ఆధ్వర్యంలో ఉండాలని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  రుణభారం సహా మొత్తం  రూ.15 వేల కోట్లకు ప్రభుత్వం ఎల్ అండ్ టీకి చెల్లించి ఫేజ్ 1 ప్రాజెక్టు స్వాధీనం చేసుకోవాల్సి ఉంటుందని సబ్ కమిటీ తమ నివేదికను కేబినెట్ ముందుంచింది.

ప్రస్తుతం మెట్రో ఆస్తుల విలువ దాదాపు రూ.19 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు ఉంటుందని అంచనా వేసింది.  దాదాపు 22 శాతం తగ్గింపు ధరకు ప్రభుత్వ మెట్రో ఫేజ్ 1ను సొంతం చేసుకుంటుంది. ఫేజ్- 2 ఏ  లో భాగంగా 5 కొత్త కారిడార్లలో 76.4 కిలోమీటర్లు, ఫేజ్- 2 బి లో 3 కారిడార్లలో 86.1 కి.మీ.ల మెట్రో విస్తరణ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కేంద్రానికి పంపించింది. ఈ నిర్ణయంతో మెట్రో విస్తరణ వేగవంతమవనుంది.