18-06-2025 07:56:02 PM
సిఐటియు బ్రాంచ్ అధ్యక్షులు వెంకటస్వామి...
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణి కార్మికుల పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం రామకృష్ణాపూర్ నుండి మంచిర్యాలకు సింగరేణి యాజమాన్యం బస్సు సౌకర్యాన్ని కల్పించాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(CITU) బ్రాంచ్ అధ్యక్షులు సాంబారు వెంకటస్వామి(CITU Branch President Sambaru Venkataswamy) డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఏరియా జిఎం జి దేవేందర్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ... కార్మికుల పిల్లలు మంచిర్యాలలోని వివిధ పాఠశాలల్లో సీబీఎస్ఈ విద్యను అభ్యసిస్తున్నారని వారి సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించాలని ఆయన కోరారు. గోదావరిఖని, ఎస్టిపిపిలలో విధులు నిర్వహిస్తున్న కార్మికుల పిల్లల సౌకర్యార్థం బస్సు సౌకర్యం ఏర్పాటు చేసిన యాజమాన్యం మందమర్రి ఏరియాలో ఏర్పాటు చేయక పోవడం బాధాకరమన్నారు.
గత నెలలో కార్మికులు వారి కుటుంబ సభ్యులు వినతి పత్రం ఇచ్చినప్పటికీ యాజమాన్యం ఇప్పటివరకు స్పందించలేదని ఆయన అన్నారు. పాఠశాలలు ప్రారంభమైనందున కార్మికుల పిల్లల ఉన్నత విద్యాభ్యాసాన్ని దృష్టిలో పెట్టుకొని సింగరేణి యాజమాన్యం స్కూల్ బస్సును ఏర్పాటు చేయాలని కోరారు. ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు సీబీఎస్ఈ సిలబస్ పేరిట, స్కూల్ ఫీజులతో పాటు బస్సుల ఫీజులు కూడా అధికంగా వసూలు చేస్తున్నారని, అధిక ఆదాయపన్నుతో కార్మికులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతున్న సింగరేణి యాజమాన్యం తమ రక్తాన్ని సంస్థ కోసం ధారపోస్తున్న కార్మికుల పిల్లల సంక్షేమాన్నీ దృష్టిలో పెట్టుకొని స్కూలు బస్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్(సిఐటియు) నాయకులు తన్వీర్ హుస్సేన్ ఎండి షఫీయుద్దీన్ లు పాల్గొన్నారు.