బ్యాంకింగ్, ఆటో షేర్లలో కొనుగోళ్లు
- 226 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
- 23,800పైకి నిఫ్టీ
ముంబై, డిసెంబర్ 26: గత రెండు ట్రేడింగ్ సెషన్లలో నిస్తేజంగా కదలిన స్టాక్ మార్కెట్ శుక్రవారం జోరు కనపర్చింది. బ్యాంకింగ్, ఆటోమొబైల్ షేర్లలో కొనుగోళ్లు జరగడంతో సూచీలు లాభాలతో ముగిసాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 226 పాయింట్ల లాభంతో 78,699 పాయింట్ల వద్ద క్లోజయ్యింది.
ఇంట్రాడేలో ఇది 570 పాయింట్లు పెరిగి 79,043 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 23,938 పాయింట్ల గరిష్ఠస్థాయిని తాకిన అనంతరం 63 పాయింట్లు లాభపడి కీలకమైన 23,800 స్థాయి ఎగువన 23,813 పాయింట్ల వద్ద నిలిచింది. ఈ వారం మొత్తంమీద సెన్సెక్స్ 657 పాయింట్లు, నిఫ్టీ 226 పాయింట్ల చొప్పున పెరిగాయి.
ఎఫ్పీఐల అమ్మకాలు
మార్కెట్లో విదేశీ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐలు) అమ్మకాలు యథాతథంగా కొనసాగుతున్నాయి. శక్రవారం ఎఫ్పీఐలు రూ.1,323 కోట్ల విలువైన ఈక్విటీలను నికరంగా విక్రయించినట్లు స్టాక్ ఎక్సేంజీల ప్రాధమిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. వరుసగా గత ఏనిమిది రోజుల్లో ఎఫ్పీఐలు మార్కెట్ నుంచి వెనక్కు తీసుకున్న పెట్టుబడులు రూ. 19,000 కోట్లను మించాయి.
ఎం అండ్ ఎం టాపర్
సెన్సెక్స్ ప్యాక్లో అన్నింటికంటే అధికంగా మహీంద్రా అండ్ మహీంద్రా 2.5 శాతం పెరిగింది. ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బజాజ్ ఫిన్సర్వ్, నెస్లే, ఐసీఐసీఐ బ్యాంక్, మారుతి సుజుకిలు 1.5 శాతం వరకూ లాభపడ్డాయి. మరోవైపు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టాటా స్టీల్, అదానీ పోర్ట్స్, జొమాటో, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్సీఎల్ టెక్లు నష్టపోయాయి.
వివిధ రంగాల సూచీ ల్లో అధికంగా ఆటో ఇండెక్స్ 0.86 శాతం పెరిగింది. హెల్త్కేర్ ఇండెక్స్ 0.79 శాతం, కన్జూమర్ డిస్క్రీషనరీ ఇండెక్స్ 0.33 శాతం, ఐటీ ఇండెక్స్ 0.22 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండెక్స్ 0.14 శాతం చొప్పన లాభపడ్డాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్, ఎనర్జీ, కమోడిటీస్ సూచీలు నష్టపోయాయి. బీఎస్ఈ స్మాల్క్యాప్ ఇండె క్స్ 0.28 శాతం , మిడ్క్యాప్ ఇండెక్స్ 0.08 శాతం చొప్పున పెరిగాయి.






