21-06-2025 05:29:43 PM
అడ్డగోలు అబద్ధాలు తలలు బాదుకుంటున్న ప్రజలు..
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్, కడం, పెంబి, దస్తురాబాద్, మండలాల్లో ప్రజలు ప్రచార మైకుల రాద్ధాంతం తట్టుకోలేకపోతున్నారు. మొన్నటి వరకు ప్రైవేట్ పాఠశాలల ప్రచారం జోరు మీద సాగి, మండలాల్లోను, గ్రామాల్లో, విపరీత శబ్ద కాలుష్యం జరగగా ప్రస్తుతం వర్షాకాలం మొదలవడంతో వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇదే అదునుగా ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు ఆటోలకు మైకులు పెట్టి విపరీత శబ్దాలతో ప్రజలను హడలెత్తీస్తున్నారు. వీరితో పాటు చిరు వ్యాపారులు పండ్లు, కూరగాయలు, ఉల్లిగడ్డలు, చిన్న గుండు పిన్నీసుకు సైతం కాలనీలో మైక్ పెట్టుకుని భయంకరమైన శబ్దాలతో వ్యాపారం చేస్తున్నారు.
తెల్లవారుజాము మొదలుకొని ఒకే జోరున, ఒకరి తర్వాత ఒకరు ఈ మైకుల శబ్దాలు కాలనీవాసుల, గ్రామాల ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. నిజానికి వీరికి స్థానిక పోలీసులు అనుమతి ఉండాల్సి ఉండగా వీరిని నియంత్రించే వారు కనుమరుగయ్యారు. దాంతోపాటు ఈ ప్రచారాల్లో అనేక అబద్దాలు చెబుతూ ప్రజలను మోసం చేస్తూ కనికట్టు చేస్తున్నారని,అనారోగ్యంతో వున్నవారు, చిన్న పిల్లలు తట్టుకోలేక పోతున్నారని స్థానికులు పలువురు అంటున్నారు. ప్రైవేట్ పాఠశాలలు, ఆస్పత్రుల ప్రచారం మైకు శబ్దాలపై పోలీసులు నియంత్రణ పెట్టాలని, వివిధ పూజలకు, వివాహ కార్యక్రమాలకు, ఇతర కార్యక్రమాలకు డీజే పెట్టుకోవాలంటే అనుమతులు కోరుతున్న అధికారులు వీరిపై మాత్రం నియంత్రణ చేయడం లేదని ఆరోపణలు ఉన్నాయి.