28-06-2025 10:40:20 PM
పేద రోగులకు వైద్యం అందించడంలో విధులపట్ల వైద్యుల నిర్లక్ష్యం.
క్యూలైన్లో రోగులు ఉన్నప్పటికీ గేమ్ లో లీనమైన వైద్యురాలు.
కొరవడిన పర్యవేక్షణ
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జనరల్ ఆస్పత్రిలోని వైద్యులు పేద రోగులకు వైద్యం అందించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. వారి పై అధికారులు తరచు విధులకు డుమ్మా కొడుతూ పట్టించుకోకపోవడంతో కిందిస్థాయి వైద్యులు సైతం తమకేమీ పట్టనట్లు ఎమర్జెన్సీ, ఐసీయూ వార్డుల్లోనూ తమ స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమింగ్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నారు. శనివారం రాత్రి సుమారు 8:40గంటల ప్రాంతంలో ఆయా గ్రామాల నుండి పెద్ద ఎత్తున రోగులు వైద్యం కోసం జిల్లా జనరల్ ఆసుపత్రికి వచ్చినప్పటికీ ఇద్దరు మహిళ వైద్యులు మాత్రమే వైద్యం అందిస్తున్నారు . మరో వైద్యురాలు తన స్మార్ట్ ఫోన్లో క్యాండీ క్రష్ గేమ్ ఆడుతూ లీనమైపోయింది. ఇతర రోగులు క్యూ లైన్ లో ఉన్నప్పటికీ సెక్యూరిటీ గార్డు ద్వారా రోగులను బయటే నిలిపి తాను మాత్రం కాలక్షేపం చేస్తూ ఉండిపోయింది. మరి కొంతమంది కిందిస్థాయి వైద్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నా తనకేమి పట్టనట్లు వ్యవహరించడంతో పక్కనే ఉన్న రోగులు అవాక్కయ్యారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ తరచూ ఆసుపత్రికి డుమ్మా కొడుతూ పర్యవేక్షణ చేయకపోవడంతోనే తన కిందిస్థాయి వైద్యులు తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ రోగుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ఆరోగ్యశ్రీ సీఈవో ఉదయ్ కుమార్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ తనిఖీ చేసిన రోజే జిల్లా ఆస్పత్రిలో ఈ విధమైన నిర్లక్ష్యం దర్శనమివ్వడం విశేషం.