05-03-2025 12:50:20 AM
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
రాజేంద్రనగర్, మార్చి 4 (విజయక్రాంతి): పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పై నుంచి వెళ్తున్న ఓ కారు లో అకస్మాత్తుగా మంటలు చెలరేగి కాలిపోయింది. ఈ సంఘటన మంగళవారం రాజేంద్రనగర్ లోని పిల్లర్ నెంబర్ 211 సమీపంలో చోటుచేసుకుంది. రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.
ఆరంఘర్ వైపు నుంచి మెహిదీపట్నం వైపు వెళ్తున్న మారుతి ఎస్ ఎక్స్4 (ఏపీ 28 డీవీ 3696) కారులో అకస్మాత్తుగా మంటలు చెడరేగాయి. ఈ విషయం గమనించిన డ్రైవర్ వెంటనే వాహనం నుంచి కిందికి దిగాడు. దట్టమైన పొగ అలుముకుని కారులో మంటలు భారీగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
త్రుటిలో ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ రద్దీ ఏర్పడకుండా రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సిబ్బంది వాహనాలను నియంత్రించారు. షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగి ఉండొచ్చని భావిస్తున్నారు. ఇటీవల అంబర్పేట ఫ్లైఓవర్ మీద కారులో మంటలు వచ్చిన విషయం తెలిసిందే.