02-06-2025 07:46:17 AM
- గిరిజన రైతులపై కేసులు నమోదు.
- మూడు ట్రాక్టర్లు సీజ్ చేసిన అటవీ అధికారులు.
కొల్లాపూర్: కొల్లాపూర్ అటవీ రేంజ్ పరిధిలో(Kolhapur Forest Range Area) కొంత మంది గిరిజన రైతులు అటవీ భూముల్లో అక్రమంగా సాగు చేస్తున్నట్లు గుర్తించి కొంతమంది గిరిజన రైతులపై కేసు నమోదు చేయడంతో పాటు మూడు ట్రాక్టర్లను సీజ్ చేశారు. అటవీ హక్కు పత్రాలు పొందిన రైతులు సైతం మరికొంత భూమిని చదును చేసేందుకు అడవిలోని భారీ వృక్షాలను నరికేసి ఆదివారం ట్రాక్టర్లతో భూమి చదును చేస్తుండగా గుర్తించినట్లు కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ తెలిపారు. అటవీ భూముల రక్షణ కోసం స్పెషల్ టీం స్ట్రైక్ ఫోర్స్ అధికారి మక్దూమ్, రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఆదివారం ముక్కుడి గుండం, చంద్రబండ తండా, గేన్య నాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలోని వట్టిమాకులకుంట, కమిలికుంట పరిసరాల్లో తనిఖీలు నిర్వహించగా అటవీ భూములను సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు.
సాగు కోసం ఉపయోగిస్తున్న మూడు ట్రాక్టర్లను అచంపేట అటవీ డిపోకు తరలించి కేసులు నమోదు చేసినట్లు తెలిపారు.అటవీ హక్కు పత్రాలు కలిగిన వారు కూడా ఎలాంటి అనుమతి లేకుండా అడవి చెట్లు నరికితే, భూమిని దున్నితే, వారి హక్కు పత్రాలు రద్దు చేయబడతాయని రేంజర్ చంద్రశేఖర్ హెచ్చరించారు. స్పెషల్ టీంలు ఏర్పాటు చేసి మరింత నిఘా పెడుతున్నట్లు పేర్కొన్నారు. ఈ దాడిలో డిప్యూటీ రేంజర్ కాషాన్న, ఫారెస్ట్ అధికారులు ముజీబ్ ఘోరి, శివ, నీలేష్, జయరాజ్, మల్లేష్, వల్యా నాయక్, నాగార్జున గౌడ్, నవీన్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.