29-06-2025 12:26:37 AM
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో విద్యనుభ్యసించి పదవ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు గ్రామ మాజీ ఎంపీటీసీ దూబాకుల వెంకన్న నగదు ప్రోత్సాహక బహుమతులను అందజేశారు. పదో తరగతి ఫలితాల్లో పాఠశాల ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్నేహకి 3వేలు, సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్ధి చాంద్ సలాం కు 2వేలు, థర్డ్ ర్యాంక్ సాధించిన యశ్వంత్ కు వెయ్యి రూపాయలు, ఉత్తీర్ణులైన మిగతా పదహారు మంది విద్యార్థులకి 500ల చొప్పున నగదు బహుమానంగా అందించారు.
ఈ సందర్భంగా మాజీ ఎంపిటిసి వెంకన్న మాట్లాడుతూ రానున్న విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించాలని పెనుగొండ పేరును రాష్ట్రవ్యాప్తంగా ఘనకీర్తిని తీసుకురావాలని విద్యార్థులకు సూచించారు. శిథిలావస్థకు చేరిన స్కూల్ బిల్డింగ్ భవనాన్ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ రెడ్డి సహకారంతో నిర్మించేందుకు రాజకీయాలకతీతంగా కృషి చేస్తున్నామని చెప్పారు. నూతన భవనం నిర్మించడంలో తన వంతు కృషి చేస్తానని చెప్పారు. ఉత్తమ ఫలితాలు సాధించడంలో కృషి చేసిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు.