వనపర్తి పోస్టల్ శాఖలో సీబీఐ సంచలనం
వనపర్తి, మే 8 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలో పోస్టల్ శాఖలో భారీ అవినీతి బండారం బయటపడింది. పోస్టల్ డిపార్ట్మెంట్ ఐపీ అధికారి గోపీనాథ్ను సీబీఐ అధికారులు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఓటీ నిధుల వ్యవహారంలో లక్షా ముప్పువేల రూపాయలు లంచం తీసుకుంటుండగా అధికారులు వల వేసి అదుపులోకి తీసుకున్నారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు సీబీఐ అధికారులు సుదీర్ఘంగా విచారణ నిర్వహించారు.
అనంతరం గోపీనాథ్ను అధికారికంగా అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ కేసులో కోట్ల రూపాయల నిధుల దుర్వినియోగం జరిగి ఉండొచ్చనే అనుమానాలతో సీబీఐ లోతుగా దర్యాప్తు చేపట్టింది.గోపీనాథ్ కార్యాలయం, నివాసంలో సోదాలు నిర్వహించిన అధికారులు కీలక పత్రాలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.
పోస్టల్ శాఖలో నిధుల మళ్లింపు, అక్రమాలపై మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఘటనతో వనపర్తి పోస్టల్ శాఖలో తీవ్ర కలకలం రేగింది. ప్రభుత్వ శాఖల్లో అవినీతి ఎలా పాతుకుపోయిందో ఈ ఘటన మరోసారి బయటపెట్టిందని ప్రజలు మండిపడుతున్నారు. సీబీఐ విచారణ కొనసాగుతోంది.






