9 May, 2026 | 7:52 AM

కొనుగోళ్లు జరుపాలని రోడ్డెక్కిన రైతన్నలు

09-05-2026 12:00 AM

హాజీపూర్‌లో రెండు గంటల పాటు రాస్తారోకో 

మంచిర్యాల, మే 8 (విజయక్రాంతి) : ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని పెద్దంపేట, టీకనపల్లి, హాజీపూర్, కర్ణమామిడి, పడ్తనపల్లి గ్రామాలకు చెందిన రైతులు అధిక సంఖ్యలో తరలివచ్చి మండల కేంద్రంలోని 63వ జాతీయ రహదారిపై శుక్రవారం రైతులు పెద్ద ఎత్తున గుమికూడి రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు ప్రక్రియలో ప్రభుత్వం తీవ్ర జాప్యం కారణం ఒకవైపు అయితే అకాల వర్షాలతో మరోవైపు తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

హాజీపూర్ ఎస్త్స్ర కిరణ్కుమార్ ధర్నా వద్దకు చేరుకుని రైతులను సముదాయించే ప్రయత్నం చేసినా వినకపోవడంతో అడిషనల్ కలెక్టర్ (లోకల్ బాడీస్) చంద్రయ్య ధర్నా స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడారు. కష్టపడి పండించిన ధాన్యం కళ్లముందే పాడైపోతోందని.. మమ్మల్ని ఆదుకోవాలంటూ కాళ్లపై పడి రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. రైతుల ఆవేదనను విన్న అడిషనల్ కలెక్టర్ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకుంటామని, ప్రతి కొనుగోలు కేంద్రానికి రోజుకు కనీసం మూడు నుంచి ఐదు లారీలను పంపించి ధాన్యం తరలింపును వేగవంతం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. సుమారు రెండు గంటల పాటు సాగిన ఈ నిరసనతో జాతీయ రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.