28-06-2025 12:40:12 AM
కామారెడ్డి, జూన్ 27,(విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపిన సీడీసీ ఛైర్మన్ ఇర్షాదొద్దీన్ రాజీనామా అంశం రాత్రికి రాత్రే సద్దుమణిగింది. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు పీఏల ఆగడాలు శ్రుతిమించుతు న్నాయని.. ఆత్మగౌరవాన్ని చంపుకుని పార్టీలో కొనసాగలేక రాజీనామా చేస్తున్నట్లు గురువారం ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్కుమార్ గౌడ్ , డీసీసీ అధ్యక్షుడి కైలాస్ శ్రీనివాస్రావు కు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా లేఖ రాశారు.
రాజీనామాతో పార్టీలో దుమారం
అసలే పదవులు రాక కొందరు ఎదురు చూస్తుంటే పదవి వచ్చిన నేత తనను చిన్నచూపు చూస్తున్నారని ఆవేదనతో సి డి సి చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం జిల్లావ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపింది. మైనార్టీ వర్గానికి చెందిన సి డి సి చైర్మన్ ఇర్షాద్ ఉద్దీన్ రాజీనామా అంశం పార్టీలో తీవ్ర దుమారం రేపింది.
ముఖ్య నాయకుడు పార్టీ నుంచి వైదొలిగితే తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని భావించిన ముఖ్య నేతలు రంగంలోకి దిగారు. సిడి సి ఛైర్మన్ఇర్షాద్ ను కాంగ్రెస్ పెద్దలు మాట్లాడి బుజ్జగించినట్లు సమాచారం. దాంతో ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకున్నట్లు ప్రకటించారు.
ఈ సందర్భంగా ఇర్షాదొద్దీన్ను విజయ క్రాంతి ప్రతినిధి సంప్రదించగా తాను రాజీనామా ఉపసంహరించుకుంటున్న విషయం నిజమేనన్నారు. తనకు ఎమ్మెల్యేపై ఎలాంటి కోపం లేదని మరోసారి స్పష్టం చేశారు. పీఏల వైఖరి నచ్చకే రాజీనామాకు సిద్ధమైనట్టు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషి చేస్తానని స్పష్టం చేశారు.
కష్టపడ్డ వారికి న్యాయం జరగట్లేదని..
ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కష్టపడ్డ ఏ నాయకునికి ఎలాంటి గౌరవం లేదని గురువారం తాను విడుదల చేసిన రాజీనామా పత్రంలో ఇర్షాదొద్దీన్ పేర్కొన్నారు. ఏ కార్యక్రమం జరిగినా మండల ప్రెసిడెంట్లకు గాని వివిధ హోదాలో ఉన్న నాయకులకు గాని ఎలాంటి సమాచారం ఉండదని వాపోయాడు.
వివిధ మండలాల్లో ఉన్న అధికారులకు పీఏలు ఫోన్లు చేసి ఏ నాయకుడు వచ్చినా ఏ కార్యకర్త వచ్చినా తాము చెప్పేవరకు పని చేయవద్దని చెప్పడం జరిగిందని ఆయన లేఖలో వివరించారు. కానీ శుక్రవారం ఆయన తన రాజీనామాను ఉపసంహరించుకుంటున్నట్లు వెల్లడించారు. దీంతో కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని కాంగ్రెస్ నాయకులలో అలజడి సద్దుమణిగింది.