28-06-2025 12:39:52 AM
ముషీరాబాద్, జూన్ 27 (విజయ క్రాంతి) : మలేషియాలో జరిగిన ప్రతిష్టాత్మక లంకావీ యూత్ ఇంటర్నేషనల్ రెగట్టాలో ఒక స్వర్ణం, రెండు రజత పతకాలను గెలుచుకుని తెలంగాణ సెయిలర్లు సత్తా చాటారని కోచ్ సుహీమ్ షేక్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటర్నేషనల్ 420 మికస్డ్ డబుల్స్ అండర్-19 విభాగంలో తనుజ కామేశ్వర్, శ్రవణ్ కత్రావత్ స్వర్ణ పతకాన్ని అందుకున్నట్లు చెప్పారు.
ఇదే విభాగంలో దీక్షిత కొమరవెల్లి, గణేష్ పీర్కట్ల జోడీ రజతం గెలుచుకున్నారని తెలిపారు. దీంతో స్వర్ణ, రజత పతకాలు రెండూ తెలంగాణకే దక్కాయన్నారు. అండర్-15 ఆప్టిమిస్ట్ విభాగంలో లాహిరి కొమరవెల్లి అద్భుత పోరాట పటిమతో రజత పతకాన్ని సాధించినట్లు పేర్కొన్నారు. జూలై 1 నుంచి హుస్సేన్ సాగర్లో జరగనున్న తదుపరి రెగట్టా పోటీల కోసం తమ శిక్షణను పునః ప్రారంభించనున్నారని తెలిపారు.