17-06-2025 12:35:25 AM
గెజిట్ నోటిఫికేషన్ విడుదల కులగణన ఈసారి ప్రత్యేకత
- 15 ఏండ్ల తర్వాత నిర్వహణ.. మొదటిసారి డిజిటల్ రూపంలో..
- వెబ్సైట్ల ద్వారా నేరుగా నమోదుకు అవకాశం
- 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు
- మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్కు మార్గం సుగమం!
న్యూఢిల్లీ, జూన్ 16: పదిహేనేండ్ల విరామం అనంతరం నిర్వహించబోయే జనగణనకు సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ను కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది. రెండు దశల్లో జనగణనను పూర్తి చేయయడంతో పాటు, కులాలకు సంబంధించిన వివరాలను కూడా సేకరించనున్నారు.
అక్టోబర్ 1, 2026 నుంచి మొదటి దశ, మార్చి 1, 2027 నుంచి రెండో దశ చేపట్టనున్నారు. ఎన్యూమరేటర్లు ఒక్కో ఇంటికి రెండుసార్లు వెళ్లనున్నారు. హౌజ్ లిస్టింగ్ ఆపరేషన్ (హెచ్ఎల్వో) పేర మొదటి విడతలో కుటుంబ ఆస్తులు, ఆదాయం, కుటుంబ పరిస్థితులు, సౌకర్యాలకు సంబంధించిన డేటాను.. పాపు లేషన్ ఎన్యూమరేషన్ (పీఈ) పేర రెండో విడతలో కుల, ఆర్థిక, సాంస్కృతిక, ఇతర సమాచారాన్ని సేకరించనున్నారు.
మొట్టమొదటి సారి గా జనగణనతో పాటు కులగణనను కూడా ప్రభుత్వం చేపడుతోంది. ఈ జనాభా లెక్కలు పూర్తి డిజిటల్ రూపంలో నిర్వహించనున్నారు. ఈ జనగణనతో మహిళా రిజర్వే షన్ బిల్లుకు, నియోజకవర్గాల పునర్విభజనకు మార్గం సుగమం కానుంది. నోటి ఫికేషన్ విడుదలతో జనాభా లెక్కింపు ప్రక్రియ అధికారికంగా మొదలయింది.
ఈ జనగణనకు సంబంధించి హోంమం త్రి అమిత్షా ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఏప్రిల్లోనే తొలి విడత హౌస్ లిస్టింగ్ ప్రారంభం కానుంది. ఈసారి జనగణనకు దేశవ్యాప్తంగా మొత్తం 34 లక్షల మంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లతో పాటు 1.34 లక్షల మంది సిబ్బందిని కేంద్రం నియమించనుంది.
గణన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలను చేపట్టనున్నట్టు కేంద్రం వెల్లడించింది. ప్రభుత్వం సూచించే పోర్టల్స్, వెబ్సైట్స్ ద్వారా ప్రజలే నేరుగా తమ వివరాలను నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పించింది.
16వ జనగణన..
దేశంలో ఇది 16వ జనగణన. స్వాతంత్య్రానంతరం జరుగుతున్న 8వ జనగణన. మంచు కురిసే ప్రాంతాలైన హిమాచల్ప్రదేశ్, లడఖ్, జమ్మూకశ్మీర్, ఉత్తరాఖండ్ మొదలైన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 2026లోనే గణన మొదలవనుంది. మొదటి విడత రాష్ట్రాల్లో 2026 అక్టోబర్ 1ని రిఫరెన్స్ తేదీగా, మిగతా ప్రాంతాల్లో 2027 మార్చి 1ని రిఫరెన్స్ తేదీగా నిర్ణయిస్తూ హోంశాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.
13 వేల కోట్ల అంచనా!
జనగణను పూర్తి చేసేందుకు రూ. 13వేల కోట్ల పైచిలుకు ఖర్చవనుందని ప్ర భుత్వం అంచనా వేస్తోంది. 2011లో జనగణన జరిగినపుడు కేవలం రూ. 2,200 కోట్లే ఖర్చయ్యాయి. అప్పుడు ఒక వ్యక్తికి సగటున రూ. 18 ఖర్చు చేశారు. ఈసారి ఆ ఖర్చు విపరీతంగా పెరిగింది. 2025 కేంద్ర బడ్జెట్లో జనగణన కోసం ప్రభుత్వం రూ. 574.80 కోట్ల నిధులు మాత్రమే కేటాయించింది.
మహిళా బిల్లుకు మార్గం సుగమం
ఈ జనగణనతో మహిళా బిల్లుకు మార్గం సుగమం కానుంది. మహిళా బిల్లుకు మాత్రమే కాకుండా నియోజకవర్గాల పునర్విభజనకు కూడా అడ్డంకి తొలగనుంది. 1971 నుంచి రాజ్యాంగ సవరణలతో నియోజకవర్గాల పునర్విభజన వాయిదా పడుతున్నది. మహిళలకు లోక్సభలో 1/3 సీట్లను కేటాయించే ఉద్దేశంతో ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకొచ్చింది.