calender_icon.png 7 June, 2025 | 11:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

13 వేల కోట్లతో జనగణన!

06-06-2025 12:00:00 AM

  1. ఈసారి జనగణనతో పాటే కులగణన
  2. 30 లక్షల మంది ఎన్యూమరేటర్లతో నిర్వహణ
  3. నెలరోజుల్లోనే పూర్తి కానుందని ప్రకటించిన కేంద్రం
  4. మంచు ప్రభావిత ప్రాంతాల్లో 2026లో
  5. మొత్తం రెండు దశల్లో నిర్వహణ
  6. ఎన్‌పీఆర్ రిజిస్టర్‌పై స్పష్టత కరువు..

న్యూఢిల్లీ, జూన్ 5: కరోనా కారణంగా 16 ఏండ్ల విరామం తర్వాత భారత్‌లో చేపట్టబోయే జనగణనకు దాదాపు 30 లక్షల మంది ఎన్యూమరేటర్ల సేవలను వినియోగించుకోనున్నారు. ఈ సారి జనగణనతో పాటుగా కులగణన కూడా చేపట్టాలని నిర్ణయించారు. మొత్తం రెండు దశల్లో జనగణన చేపట్టనున్నట్టు ప్రకటించిన కేంద్రం మార్చి 2027 మార్చిలోపు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు తెలిపింది.

పర్వత ప్రాంతాల్లో 2026 అక్టోబర్‌లోనే జనగణన ప్రక్రియ పూర్తవనుంది. ఇందుకు సంబంధించిన గెజిట్‌ను త్వరలో రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ జనాభా లెక్కల ఆధారంగానే 2029లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. చివరిసారిగా 2011లో జనాభా లెక్కలు చేపట్టారు. జనాభా లెక్కల ప్రక్రియ 2021లో చేపట్టాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదా పడింది. దేశవ్యాప్తంగా కులగణన కూడా చేపట్టాలని ఏప్రిల్ 30న కేంద్ర క్యాబినెట్ నిర్ణయించింది. 

రెండు దశల్లో.. 

జనగణనను రెండు దశల్లో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. పర్వత ప్రాంతాలైన లడఖ్, జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లలో 2026 అక్టోబర్ వరకే పూర్తి చేయనున్నారు. ఇక దేశంలోని మిగతా ప్రాంతాల్లో మాత్రం 2027 మార్చి వరకు ప్రక్రియను పూర్తి చేయనున్నారు. 2011 జనాభా లెక్కలు కూడా రెండు దశల్లో జరిగాయి. 

2021 జనాభా లెక్కల కోసం 24 లక్షల మంది ఎన్యూమరేటర్లను ఫైనలైజ్ చేయగా.. 2027కు దాదాపు 30 లక్షల మంది ఎన్యూమరేటర్లను వినియోగించుకోనున్నట్టు సమాచారం. ఈసారి కులగణన కాలమ్ కూడా అదనంగా ఉండనుంది. అందుకోసం కావాల్సిన శిక్షణను కూడా అందిస్తున్నారు.

జనాభా లెక్కింపుతో పాటు జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్‌పీఆర్) అప్‌డేట్ చేస్తారా? లేదా అనే విషయంలో కేంద్రం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. 2020 సమయంలో మాత్రం జనగణన పూర్తయిన వెంటనే ఎన్‌పీఆర్ అప్‌డేట్ అవుతుందని ప్రకటించారు. కానీ ఆనాడు మహమ్మారి కారణంగా గణన జరగలేదు. 

భారీగా పెరిగిన అంచనా వ్యయం..

జనగణనకు కావాల్సిన ఖర్చుకు సంబంధించిన అంచనా వ్యయం భారీగా పెరిగింది. 2027లో జరిగే జనగణనకు రూ. 13,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. 2021 జనాభా లెక్కల కోసం 2019 డిసెంబర్‌లో కేంద్రం రూ. 8,754 కోట్లను రిలీజ్ చేసింది. ఎన్‌పీఆర్ అప్‌డేట్ కోసం మరో రూ. 3,941 కోట్లు ఇచ్చేందుకు కూడా సుముఖత వ్యక్తం చేసింది.

కానీ 2025 బడ్జెట్‌లో కేంద్రం జనగణన రిజిస్ట్రార్ జరరల్‌కు రూ. 574 కోట్లే కేటాయించడం గమనార్హం. 2011లో పూర్తయిన వివరాల ప్రకారం భారతదేశ జనాభా 121.01 కోట్లుగా తేలింది. ఈ మధ్య కాలంలో ఆ సంఖ్య విపరీతంగా పెరిగి ఉంటుంది. ఈ జనాభా లెక్కింపులో ఎన్యూమరేటర్లు దాదాపు 3 డజన్ల ప్రశ్నలు అడగనున్నారు. ఈ ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆధారంగానే సామాజిక, ఆర్థిక, స్థితిగతులపై ఓ అంచనాకు రానున్నారు.  

ఎన్యూమరేట్లు అడిగే ప్రశ్నలివే.. 

* ఇంటి నంబర్?

* ఇంటి పరిస్థితి ఎలా ఉంది?

* ఇంటి పెద్ద వివరాలు?

* ఇంటి పెద్ద కులం?

* ఇంట్లో ఉంటున్న వివాహమైన జంటలు?

* ఇంట్లో ఉన్న నివాస గదులు?

* తాగు నీటికి ప్రధాన వనరు?

* ఎటువంటి మరుగుదొడ్డి వాడుతున్నారు?

* ద్విచక్రవాహనం, కారు, జీపు, వ్యాన్ ఉందా?

* బ్యాంకింగ్ సేవలు వాడుతున్నారా?

* రేడియో లేదా టీవీ వాడుతున్నారా? 

* మొబైల్, ఇంటర్నెట్ వినియోగిస్తున్నారా?

* వంట చేసేందుకు ఏ ఇంధనం ఉపయోగిస్తున్నారు?

* వ్యాపారామా.. లేక ఉద్యోగం చేస్తున్నారా?

* ఈ ప్రాంతంలో ఎంత కాలం నుంచి ఉంటున్నారు?