calender_icon.png 14 June, 2025 | 7:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కరీంనగర్‌లో కేంద్ర బృందం

14-06-2025 01:05:39 AM

  1. వరద కాలువ, మిడ్ మానేరు తనిఖీ 

జల్ జీవన్ మిషన్ పథకం అమలులో భాగంగా పర్యవేక్షణ

కరీంనగర్, జూన్ 13 (విజయక్రాంతి): జల్ జీవన్ మిషన్ పథకం అమలు పర్యవేక్షణలో భాగంగా సెంట్రల్ వాటర్ కమిషన్ పరిధిలోని కేంద్ర నోడల్ అధికారుల బృందం ఇందిరమ్మ ప్రధాన వరద కాలువ, మధ్య మానేరు కాలువలు, ఉపకాల్వలను గురువారం తనిఖీ చేసింది. సెంట్రల్ వాటర్ కమిషన్ సంయుక్త కార్యదర్శి సింతల్ రాజన్ చొక్కలింగం ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం కరీంనగర్ కలెక్టరేట్‌లో కలెక్టర్ పమేలా సత్పతి, నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమైంది.

జిల్లాలో నీటిపారుదల పనులకు సంబంధించి గతంలో కేంద్రం మంజూరు చేసిన నిధులతో పూర్తిచేసిన పనుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇందిరమ్మ ప్రధాన వరద కాలువ, మధ్య మానేరు జలాశయ కుడి, ఎడమ కాలువల వ్యయం, నీటి నిల్వ సామర్థ్యం గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు సంబంధించిన విషయాలను నీటిపారుదల శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా కేంద్ర బృందానికి వివరించారు.

92 శాతం ఇందిరమ్మ వరద కాలువ పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఈ కాలువ ద్వారా 21 వేల 192 హెక్టార్లకు సాగునీరు అందుతుందని తెలిపారు. భూ సేకరణలో ఇబ్బందుల వలన కొంతమేర పనులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందుకు  సుమారు రూ.300 కోట్లు అవసరమవుతాయని అధికారులు వెల్లడించారు. ఈ నిధులు కేటాయిస్తే కాలువ పనులు 100శాతం పూర్తయి మరింతమంది రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని బృందానికి వివరించారు.

ఈ సందర్భంగా కేంద్ర బృందం సభ్యులు మాట్లాడుతూ.. నీటిపారుదల ప్రాజెక్టు పెండింగ్ పనులను పూర్తి చేయడానికి అవసరమైన నిధులకు సంబంధించిన పూర్తి నివేదికను కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. సమావేశంలో కేంద్ర బృందం సభ్యులు సుధీర్ కుమార్, ఈఈ ధీరజ్ సింఘాల్, సూపరింటెండెంట్ ఇంజనీర్ సుమతీ దేవి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగన్, ఎస్‌ఈ పెద్ది రమేష్, ఏఈలు పాల్గొన్నారు.