14-06-2025 01:11:05 AM
హైదరాబాద్, జూన్ 13 (విజయ క్రాంతి): దేవాలయాల సమగ్ర అభివృద్ధికి సీజీఎఫ్ నిధులను పారదర్శకంగా వినియోగించాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. రాష్ర్టవ్యాప్తంగా టెంపుల్ టూరిజాన్ని విస్తృతంగా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. ఎండోమెంటు డిపార్టుమెంట్ అధికారులు ప్రధానంగా ఈ అంశంపైనే దృష్టి పెట్టాల్సిన అనివార్యత ఉందని వెల్లడించారు.
ఆషాఢ బోనాలు ఈ దఫా వరంగల్ భద్రాకాళి ఆలయంలో ఘనం గా నిర్వహించాలని నిర్ణయించినట్టు చెప్పారు. శుక్రవారం సచివాలయంలో ఎండోమెంటు డిపార్టుమెంట్ సీజీఎఫ్ కమిటీ సమావేశం నిర్వహించారు. రాష్ర్టంలో చిన్నచిన్న దేవాలయాల అభివృద్ధికి ఇవ్వాల్సిన నిధులపై మం త్రి కొండా సురేఖ సమీక్షించారు. దేవాలయాల అభివృద్ధికి ఈవోలు, ఆ శాఖ ఉన్నతా ధికారుల కృషి అనివార్యమని అభిప్రాయపడ్డారు.
బడ్జెట్ అనుమతులు, సీజీఎఫ్ నిధుల కోసం వచ్చిన విజ్ఞప్తుల మీద అధికారులతో చర్చించారు. సీజీఎఫ్ సమావేశంలో రూ. 72.47 కోట్ల విలువైన, మొత్తం 297 పనులకు ఆమోదం తెలిపారు. ఆలయాల్లో భక్తులకు సౌకర్యాలు కల్పించడంతోపాటు ఆలయాల అభివృద్ధి, ఆదాయ వనరులు పెంచేందుకు ప్రణాళికతో ముందుకెళ్లాలని అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
టెంపుల్ టూరిజం సర్క్యూట్లపై మరింత కసరత్తు చేయాలన్నారు. ఈ సమావేశం రాష్ట్ర దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, ఆ శాఖ డైరెక్టర్ వెంకట్రావు, అడిషనల్ కమిషనర్ కృష్ణవేణి, ఇతర ఉన్నతాధికారులు, ఈవోలు, సీజీఎఫ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.