25-06-2025 12:00:00 AM
మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి
హైదరాబాద్, జూన్ 24 (విజయక్రాంతి): గోదావరి నీళ్లను తరలించేందుకు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు కుట్ర చేస్తున్నారని, తెలంగాణను ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మె ల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. గోదావరి, బనకచర్లపై రాష్ర్ట ప్రభుత్వం సీరియస్గా లేదన్నారు. కృష్ణా నది నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, గోదావరి విషయంలోనూ తెలంగాణకు అన్యా యం చేయాలని చూస్తున్నారని ఆయన వి మర్శించారు.
మంగళవారం తెలంగాణభవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.. గోదావరి, బనకచర్లపై క్యాబినెట్లో సీరియస్ చర్చ జరగలేదని, గోదావరి, బనకచర్లపై అన్ని పార్టీలు తెలంగాణలో ఏకం కావాలన్నారు. చంద్రబాబు నాయుడును చర్చలకు పిలవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం పనికిమాలిన చర్య అని విమర్శించారు. అపె క్స్ కౌన్సిల్ నిర్వహించాలని తెలంగాణ ప్రభు త్వం కేంద్రాన్ని డిమాండ్ చేయాలన్నారు.
చంద్రబాబునాయుడుతో చర్చలు చేస్తే తెలంగాణకు నష్టం జరుగుతుందని, ఒక వర్గం మీడియా పథకం ప్రకారం తెలంగాణలో రాజకీయ పార్టీల పంచాయితీగా గోదావరి జలాల అంశాన్ని చూపెడుతోందని జగదీశ్రెడ్డి ఆరోపించారు. రాష్ర్ట ప్రభుత్వం చర్యలు సరైన మార్గంలో లేవని, గోదావరి, కావేరి లింక్ అని చంద్రబాబునాయుడు చెప్పడం పెద్ద మోసమన్నారు. ఈ లింక్పై ఛత్తీస్ఘడ్ ప్రభుత్వం ఎప్పుడో అభ్యంతరం చెప్పిందన్నారు. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు గోదావరి జలాల అంశంపై అవగాహన పెంచుకోవాలన్నారు.
త్వరలోనే గోదావరి ట్రిబ్యునల్ వచ్చే అవకాశం ఉందని, ఈ ట్రిబ్యునల్ రాకముందే 200 టీఎంసీలకు హక్కు కల్పించుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం కార్యాచరణ తీసుకోకపోతే ప్రజలతో కలసి రాజకీయ పార్టీగా పోరాటం చేస్తామన్నారు. సూర్యాపేటలో రప్పా, రప్పా ఫ్లెక్సీలు తన దృష్టికి రాలేదని, బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రాజకీయ ఘర్షణలు రాష్ర్టంలో లేవన్నారు. ఏపీలో ఉన్న దాడుల సంస్కృతిని తెలంగాణకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారని జగదీ శ్రెడ్డి ఆరోపించారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు ఎన్.భాస్కర్రావు, రవీంద్రకుమార్, మెతుకు ఆనంద్ పాల్గొన్నారు.