పాఠశాలల టైంటేబుల్ మార్పు
- ఉదయం 9 గంటలకే బడి ప్రారంభం
- సాయంత్రం 4.15 గంటలకు ముగింపు
- వ్యతిరేకిస్తున్న పలు ఉపాధ్యాయ సంఘాలు
హైదరాబాద్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రంలోని బడుల సమయపాలనను మారు స్తూ పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రైమరీ స్కూళ్లకు అనుగుణంగా ఉన్నత పాఠశాలల సమయాల్లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. ఉన్నత పాఠశాలల సమయాన్ని ఉదయం 9.30 గంటలకు బదులుగా 9 గంటలకు మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సాయంత్రం 4.45 గంటలకు బదులుగా 4.15 గంటలకే పాఠశాలలు ముగుస్తా యని తెలిపింది. జీహెచ్ఎంసీలో ట్రాఫిక్ సమస్యలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అమలులోకి ఉన్న పనివేళలు యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది.
కరెక్ట్ టైమ్ 9.30 గంటలే
ఉదయం 9.30 గంటలే సరైన సమయమని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి సురేశ్ తెలిపారు. అన్ని పాఠశాలల సమయం 9.30 గంటలకే మార్చాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో 9 గంటలకే విద్యార్థులు బడులకు వచ్చే పరిస్థితి లేదన్నారు. గ్రామాల నుంచి 2 నుంచి 5 కి.మీ దూరం వరకు ప్రయాణం చేసి రావాలన్నారు. అన్ని స్కూళ్లను ఉదయం 9.30 గంటలకు ప్రారంభిస్తేనే విద్యార్థులకు మేలు జరుగుతుందని తెలిపారు. టైంటేబుల్ మార్పుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి.






