ఆదాయం పన్ను రేట్లలో మార్పులు!
న్యూఢిల్లీ: ప్రతిసారీ కేంద్ర బడ్జెట్కు ముందు తమకేవైనా రాయితీలు ముఖ్యంగా వ్యక్తిగత పన్ను చెల్లింపు విషయంలో ఊరట కలుగుతుందా అని వేతన జీవులు ఎదురు చూడడం సహజంగా మారింది. అయితే గత కొంత కాలంగా వారికి ఆ ఊరట దక్కడం లేదు. కానీ ఈ సారి బడ్జెట్లో మాత్రం కొన్ని వర్గాల వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు రటనిచ్చే యోజనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోందని. జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. దేశంలో కొనుగోలు శక్తిని పెంచడం కోసం ఈ చర్య తీసుకోవాలని అనుకొంటున్నట్లు తెలుస్తోంది. జులైలో పార్లమెంటులో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమర్పించబోయే పూర్తిస్థాయి బడ్జెట్లో ఈ మేరకు ప్రతిపాదనలు ఉండే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు చెప్పినట్లు ఆ కథనాలు పేర్కొన్నాయి.
కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచిచన మోడీ సర్కార్కు ఈ సారి ఆశించిన స్థాయిలో పలితాలు రాకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ద్రవ్యోల్బణం పెరుగుదల, నిరుద్యోగం, ఆదాయాలు తగ్గడం వంటి వాటి విషయంలో కొన్ని వర్గాల్లో ఉన్న అసంతృప్తి ఈ పరిస్థితికి కారణమని ఎన్నికల తర్వాత జరిగిన సర్వేల్లో వెల్లడయింది. 202324 ఆర్థిక సంవత్సరంలో దేశ ఆర్థికాభివృద్ధి అంచనాలకు మించి 8.2 శాతం ఉండగా వినియోగం మాత్రం దానిలో సగం మాత్రమే పెరిగింది.
మధ్యతరగతి సేవింగ్స్ను పెండంతో పాటు వారి జీవనప్రమాణాలను మెరుగుపర్చడంపై తమ ప్రభుత్వం ప్రధానంగా దృష్టిపెడుతుందని మూడో సారి ప్రభుత్వం ఏర్పాటుకోసం సిద్ధమయిన తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా మధ్యతరగతి ఆదాయ వర్గాలకు ఊరట కల్పించడానికి ఈ చర్య తీసుకోవచ్చని తెలుస్తోంది. ముఖ్యంగా రూ.15 లక్షలకు పైగా వార్షికాదాయం ఆర్జిస్తున్న వారికి ఈ ఊరట ఉండొచ్చని చెబుతున్నారు.
ప్రస్తుతం రూ.15 లక్షల లోపు ఆదాయం ఉన్న వారికి పన్ను రేటు 5నుంచి 20 శాతం మధ్య ఉండగా రూ.15 లక్షలు పైబడిన వారికి గరిష్ఠంగా 30 పన్ను విధిస్తున్నారు. అలాగే రూ.10 లక్షల వార్షికాదాయంపైనా పన్ను రేట్లు తగ్గించే ఆలోచన ప్రభుత్వం చేస్తోందని ఆ వర్గాలు తెలిపాయి. కొత్త ఆదాయం పన్ను శ్లాబుల గురించి కూడా చర్చ జరుగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. అయితే దీనిపై ఆర్థిక శాఖ అధికారికంగా ఎలాంటి వ్యాఖ్యా చేయలేదు.






