26-11-2025 12:00:00 AM
మాజీ ఉపముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య
హనుమకొండ, నవంబర్ 25 (విజయ క్రాంతి): వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా పార్టీలు మారే కడియం శ్రీహరి తీరు ఊసరవెల్లి లాగా ఉందని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన్నారు. కడియం శ్రీహరి అంటేనే ఫిరాయింపులకు బ్రాండ్ అని రాజయ్య ఎద్దేవా చేశారు. మంగళవారం బీఆర్ఎస్ పార్టీ హనుమకొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ కడియం శ్రీహరి ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కుతూ రాజ్యాంగాన్ని, స్పీకర్ ను అవమానించే విధంగా తను రాజీనామా చేయనంటున్నారని, నువ్వు రాజీనామా చేయకు బహిష్కరణకు సిద్ధంగా ఉండు అన్నారు.
తనకు తానే నీతి మంతుడు అని చెప్పుకునే శ్రీహరి దోచుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని పని చేస్తున్నారని, కనీసం గ్రామాల్లో తిరిగే పరిస్థితి ఆయనకు లేదన్నారు. శ్రీహరి నీతిమంతుడు అయితే రెండు సంవత్సరాల్లో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని సవాల్ విసిరారు. మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం నవంబర్ 26 నుంచి డిసెంబర్ 9 వరకు 11 రోజుల పాటు దీక్ష దివాస్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామని, సన్నాహక కార్యక్రమానికి బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరవుతారని కార్యకర్తలు,
ఉద్యమకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్న విజయవంతం చేయాలని వినయ్ భాస్కర్ కోరారు. రైతు రుణ విముక్తి కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కూడా మాజీ చైర్మన్ మర్రి యాదవ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ నాయకులు హరి రమాదేవి, కార్పొరేటర్లు చెన్నం మధు, రంజిత్ రావు, సోద కిరణ్, జోరిక రమేష్, పులి రజనీకాంత్ , మేకల బాబు తదితరులు పాల్గొన్నారు.