23 April, 2026 | 9:28 PM

ఉచ్చులో చిక్కి చిరుత మృతి

19-12-2024 11:43 AM

విజయవాడ: పంటలను కాపాడుకునేందుకు అడవి పందులకు వేసిన ఉచ్చులో చిక్కుకుని చిరుత మృతి చెందిన సంఘటన కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నెల రోజుల క్రితం చిరుతపులి కదలికలను స్థానిక రైతులు గుర్తించారు. దురదృష్టవశాత్తు, చిరుతపులి చిక్కుకుపోవడంతో గాయాలపాలై మృతి చెందింది. గురువారం ఉదయం రైతు పొలం వద్దకు వెళ్లగా పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుతపులి చిక్కి చనిపోవడాన్ని గమనించాడు. సమాచారం అందుకున్న అటవీ, పోలీసు శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించడం ప్రారంభించారు. జంతువు మృతికి సంబంధించిన పరిస్థితులపై అధికారులు ఆరా తీస్తున్నారు. చిరుతపులి చిక్కి చనిపోయిందన్న వార్త తెలుసుకున్న గ్రామస్తులు  మెట్లపల్లి చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో ఇంకా ఎన్ని చిరుతలు ఉన్నాయోనని భయాందోళనకు గురవుతున్నారు.