06-06-2025 02:55:43 PM
కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న కల నేటికి సాకారమైంది
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం జమ్మూకశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ(Prime Minister Narendra Modi) పలు శంకుస్థాపనలు, అభివృద్ధి కార్యక్రమాాలను ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైన చీనాబ్ రైల్వే వంతెనను నరేంద్ర మోదీ జాతికి అంకితం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... జమ్మూ కశ్మీర్ జన్మభూమికి ప్రణామం చేశారు. మాతా వైష్ణోదేవి ఆశీర్వాదం మెండుగా ఉందన్నారు. చీనాబ్ బ్రిడ్జి, అంజిర్ వంతెనను జాతికి అంకితం చేశామని చెప్పారు. సుమారు రూ.40 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశామని తెలిపారు. తాజా శంకుస్థాపనలు జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి దోహదం చేస్తాయి.. జమ్మూకశ్మీర్ లో అభివృద్ధి కొత్త పుంతలు తొక్కుతుందన్నారు. చీనాబ్ వంతెన వల్ల భారతీయ రైల్వే వ్యవస్థతో శ్రీనగర్ కు కనెక్టివిటీ పెరుగుతుందని చెప్పారు. జమ్మూ కాశ్మీర్ ప్రజల ఆకాంక్షలు ఇవాళ నెరవేరుతున్నాయని ప్రధాని పేర్కొన్నారు.
చీనాబ్ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ బ్రిడ్జి.. చీనాబ్ వంతెన ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనదన్నారు. చీనాబ్ వంతెన పర్యాటక ప్రాంతంగా పరిఢవిల్లుతుందని ప్రధాని ఆకాంక్షించారు. కాశ్మీర్ లోయకు రైలును నడపాలన్న కళ నేటితో సాకారమైందని నరేంద్ర మోదీ తెలిపారు. భారతీయ ఇంజినీర్ల నైపుణ్యానికి ప్రతీక.. అంజిర్ వంతెన అన్నారు. ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్ల ఎత్తులో చీనాబ్ రైల్వే వంతెన నిర్మాణం జరిగిందని ప్రధాని చెప్పారు. చీనాబ్ వంతెనతో పర్యాటకంగా అభివృద్ధి సాధ్య మన్నారు. చీనాబ్ వంతెన జమ్మూకశ్మీర్ పురోగతికి ప్రతిబింబం అన్నారు. ఇవాళ్టిరోజు కోసం జమ్మూకశ్మీర్ ప్రజలు ఎంతకాలంగా ఎదురుచూశారని చెప్పారు. వంతెన ప్రారంభంతో లక్షలాది ప్రజల కలలు నెరవేరాయిని తెలిపారు. వంతెన నిర్మాణం సవాల్ తో కూడుకున్నది.. సవాళ్లు ఉన్నా వెనక్కి తగ్గకుండా ముందుకెళ్లామన్నారు. మాతా వైష్ణోదేవి ఆశీస్సులతో విజయవంతంగా పూర్తిచేశామని పేర్కొన్నారు. లక్షలాది మంది జమ్మూకశ్మీర్ ప్రజల కల సాకారం చేయడమే తమ లక్ష్యమని ప్రధాని సూచించారు.
గత ఐదేళ్లలో 5 నూతన వైద్య కళాశాలలు ప్రారంభించాం
జమ్మూకశ్మీర్ లో గత ఐదేళ్లలో 5 నూతన వైద్య కళాశాలలు ప్రారంభించామని చెప్పారు. మెడికల్ సీట్లు 500 నుంచి 1300 వరకు పెరిగాయన్నారు. కొన్ని పార్టీలు పేదలను రాజకీయాలకు వాడుకుంటాయని ప్రధాని ఆరోపించారు. ఎన్డీఏ ప్రభుత్వం మాత్రం పేదల అభివృద్ధికి కృషి చేస్తోందని తేల్చిచెప్పారు. ఎన్డీఏ హయాంలో 4 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మించామన్నారు. ఆయుష్మాన్ భారత్ ద్వారా 50 కోట్ల మందికి రూ. 5 లక్షల ఆరోగ్య బీమా కల్పించామని తెలిపారు. ఎన్డీఏ హయాంలో 50 కోట్ల జన్ ధన్ ఖాతాలు తెరిచారని ఆయన వెల్లడించారు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్లు మరుగుదొడ్లు నిర్మించామన్నారు. జల్ జీవన్ మిషన్ కింద 12 కోట్లు ఇళ్లకు నళ్లా కనెక్షన్ ఇచ్చామన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 10 కోట్ల మంది రైతులకు ఆర్థికసాయం చేస్తున్నామని చెప్పుకొచ్చారు.
ఉగ్రవాదంపై వెనక్కి తగ్గేదిలేదు
పహల్గాంలో అమాయక ప్రజలు హత్యకు గురయ్యారని ప్రధాని మోదీ ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో వెనక్కి తగ్గేది లేదన్నారు. కాశ్మీర్ లో పర్యాటకాన్ని ధ్వంసం చేయాలని కుట్ర పన్నారని ప్రధాని తెలిపారు. జమ్మూకశ్మీర్ లోని పేదలపై పాకిస్థాన్ కుట్రలు చేస్తుందని ప్రధాని మోదీ ఆరోపించారు. జమ్మూకశ్మీర్ లోని పర్యాటకాన్ని దెబ్బతీయాలని పాక్ చూస్తోందన్నారు. పర్యాటకాన్ని దెబ్బతీసి పేదల పొట్టకొట్టాలని పాక్ చూస్తోందని నరేంద్ర మోదీ మండిపడ్డారు. పాక్ కుయుక్తులను ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతూనే ఉందన్నారు. భారత్ తన భూభాగంలోకి వచ్చి మరీ దాడి చేస్తుందని పాకిస్థాన్ ఊహించలేదని ప్రధాని మోదీ తెలిపారు. ఉగ్ర కుట్రలకు ఎప్పటికప్పుడు సరైన జవాబిస్తున్నామని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు పన్నినా కాశ్మీర్ అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. ఆపరేషన్ సింధూర్ తో మన శక్తి ఏంటో చూపించామన్నారు. ఆపరేషన్ సింధూర్ తో పాక్ నాయకత్వానికి నిద్ర లేకుండా చేశామని ప్రధాని చెప్పారు. అమాయక ప్రజల జోలికోస్తే మనం ఏం చేస్తామనేది చూసి చూపించామని వివరించారు. పాకిస్థాన్ కు బుద్ధి చెప్పేందుకు జమ్మూకశ్మీర్ యువత కూడా సిద్ధంగా ఉందని హెచ్చరించారు.