07-06-2025 12:00:00 AM
ఆపరేషన్ సిందూర్ తర్వాత పాక్ నుంచి భారత్కు మూడు లేఖలు
న్యూఢిల్లీ, జూన్ 6: పహల్గాం దాడి తర్వాత భారత్ సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపేయడంతో దాయాది పాక్ ఉక్కిరిబిక్కిరి అయ్యింది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరుతూ భారత్కు ఇప్పటివరకు నాలుగు లేఖలు రాసింది. ఇందులో ఒక లేఖను మేనెల ప్రారంభంలో రాయగా, మిగతా మూడింటిని ఆపరేషన్ సిందూర్ తర్వాత రాసింది. ఈ విషయాన్ని జాతీయ మీడియా వెలువరించింది.
భారత జలశక్తి మంత్రిత్వ శాఖకు పాక్ జలవనరుల శాఖ నుంచి ఈ లేఖలు వచ్చినట్టు తెలుస్తోంది. సింధూ జిలాల నిలిపివేతతో పాక్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంటుందంటూ పాక్ తన లేఖలో పేర్కొంది. ఈ విషయంలో చర్చించేందుకు పాక్ సిద్ధంగా ఉందని వాటి సారాంశం. ప్రోటోకాల్లో భాగంగా ఈ అంశాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు పంపినట్టు తెలుస్తోంది.