15-11-2025 01:50:49 AM
29 స్థానాల్లో పోటీ.. 19 చోట్ల గెలుపు
బీహార్ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి సత్తా చాటింది. కూటమిలోని చిరాగ్ పాశ్వాన్ నేతృత్వంలోని ఎల్జేపీ (రాంవిలాస్ పాశ్వాన్) 65 శాతం స్ట్రుక్ రేట్ సాధించింది. గత ఎన్నికల్లో ఒకే ఒక్క స్థానానికి పరిమితమైన ఆ పార్టీ నేడు కూటమి భారీ విజయంలో కీలక పాత్ర పోషించింది. సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నితీశ్కుమార్ నేతృత్వంలోని జేడీయూ గతంలో కంటే ఈ సారి ఎక్కువ సీట్లు తెచ్చుకోగా.. కూటమిలోని మరో అతిపెద్ద పార్టీ బీజేపీ కూడా మంచి విజయాలను సాధించింది.
ఒకప్పుడు తండ్రిని, తండ్రి స్థాపించిన పార్టీని సైతం కోల్పోయిన చిరాగ్.. వరుస ఎన్నికల్లో గెలుస్తూ.. సత్తా చాటుతున్నారు. తండ్రి వారసత్వాన్ని నిలబెట్టారు. 2020 ఎన్నికల్లో ఎన్డీయేలోని బీజేపీకి మద్దతిస్తూ.. 137 సీట్లకు తమ పార్టీ తరఫున అభ్యర్థులను బరిలో దింపాపరు. కానీ ఆ పార్టీకి ఒక్క సీటు మాత్రమే దక్కింది. 2015లో బాబాయ్ పశుపతి కుమార్ పరాస్తో చిరాగ్కు విభేదాలు వచ్చాయి.
దీంతో 2021లో ఎల్జేపీ(రాం విలాస్) పేరుతో కొత్త పార్టీ పెట్టారు. యువ బీహారీగా ప్రజలకు చేరువై.. దళిత నాయకుడిగా ఎదిగి, ఎన్డీయేతో మళ్లీ కలిసి 2024 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన 5 స్థానాల్లోనూ గెలిచి తనేంటో నిరూపించుకున్నారు చిరాగ్ పాశ్వాన్. 100 శాతం స్ట్రుక్ రేట్ సాధించడమే కాకుండా కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రి అయ్యారు. ప్రస్తుత ఎన్నికల్లో 29 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన చిరాగ్ నేతృత్వంలోని ఎల్జేపీ(ఆర్వీ) 19 స్థానాల్లో గెలిచింది.
65 శాతం స్ట్రుక్ రేట్ సాధించింది. 2029 ఎన్నికల్లో మోదీని నాలుగోసారి ప్రధానిని చేయడమే లక్ష్యమని తన అచంచెలమైన ప్రేమను చాటుకున్నారు. అంతేకాకుండా బీహార్లో తనను అత్యున్నత స్థానంలో చూడాలని కార్యకర్తలు కోరుకుంటున్నారని మీడియా వేదికలపై పేర్కొన్నారు.