02-02-2026 06:21:21 PM
కొల్చారం,(విజయక్రాంతి): ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కోశాధికారి కే. నర్సమ్మ కోరారు. సోమవారం కొల్చారం మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఎంపీడీఓ రఫీకున్నీస కు సమ్మె నోటీసు అందజేశారు.
ఈ సందర్భంగా నర్సమ్మ మాట్లాడుతూ కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి 4 లేబర్ కోడ్లు అమలు చేయడం వల్ల కార్మికులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. గ్రామ పంచాయతీ కార్మికులకు గత 3–4 నెలలుగా జీతాలు చెల్లించడం లేదని తెలిపారు.
గ్రామ పంచాయతీ కార్మికులకు 2వ పీఆర్సీ అమలు చేయాలని, జీవో నెం.51 రద్దు చేయాలని, ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లు నమోదు చేయాలని, అందరికీ ఇందిరమ్మ ఇళ్లు, కనీస వేతనం రూ.26 వేలతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమ్మెలో మండలంలోని కార్మికులందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు లక్ష్మణ్, నాగరాజు, ప్రభాకర్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.