30-06-2025 06:42:27 PM
చర్ల (విజయక్రాంతి): నిగర్వి, ఆదరనీయులు, ఎల్లప్పుడూ విద్యార్థుల భవిష్యత్తు కోసం తపన పడ్తూ, తన 25 సంవత్సరాల ఉపాధ్యాయ సేవలను చర్ల మండలంలోని విద్యార్థినీ విద్యార్థులకు అందిస్తూ మచ్చలేని గురువుగా పేరు గాంచిన శ్రీ జవ్వాధి నరేంద్ర బాబు ఉద్యోగ విరమణ సన్మాన సభను సోమవారం లింగాపురం ఎంపీపీఎస్ పాఠశాలలో గ్రామస్తులందరిచే నిర్వహించడం జరిగింది. ప్రధానోపాధ్యాయులు పాండు రాజు అధ్యక్షతన జరిగింది, ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ... సాధారణ వ్యక్తిత్వం, అసాధారణమైనటువంటి ప్రతిభ, క్రమశిక్షణ, సమయ పాలన మొదలైన సద్గుణాలకు నిలువెత్తు నిదర్శనం నరేంద్ర బాబేనని, ఎంతోమందికి మార్గదర్శకంగా ఉంటూ-స్పూర్తి ప్రధాత అయ్యారని, పలువురి దాతల సహకారంతో పాఠశాల మౌలిక వసతుల కల్పనకు ఎంతగానో కృషి చేసారని కొనియాడారు.
తదుపరి శ్రేయోభిలాషులందరిచే పూలమాలలు, శాలువాలు, బొకేలతో ఘనంగా సత్కరించారు. ఇదే వేదికపై బండారు రామకృష్ణ తదితరులు వితరణ చేసిన స్కూల్ బ్యాగ్ లను విద్యార్థీనీ విద్యార్థులకు పంపిణీ చేయడం జరిగింది, అలాగే కీర్తిశేషులు పరుచూరి వెంకయ్య జ్ఞాపకార్ధం వారి చిన్న కుమార్తె అయిన కే సరళ, వారి కుటుంబ సభ్యులు పంపిన వితరణతో పాఠశాల మధ్యాహ్న భోజనాలకు ఉపయోగపడే విధంగా గ్యాస్ సిలిండర్, స్టవ్ లను వంటల సిబ్బందికి అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి పరిటాల రమణ, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు బీసమ్మ, గ్రామ పెద్దలు బండారి రామకృష్ణ, ఎర్రింకి రామారావు, మీకోసం మేమున్నాం టీం ఛైర్మెన్ లయన్ నీలి ప్రకాష్, విద్యా కమిటీ చైర్మన్, తదితరులు పాల్గొన్నారు.