calender_icon.png 16 November, 2025 | 2:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెండు రోజుల్లో పదవీ విరమణ.. ఇదే నా చివరి కార్యక్రమం

16-11-2025 01:20:49 PM

అమరావతి: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం మంగళగిరిలో కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లో పదవీ విరమణ చేయబోతున్నానని, సీజేఐగా ఇది తన చివరి కార్యక్రమం అని చెప్పారు. ఆయన స్వస్థలం మహారాష్ట్రలోని అమరావతి అని, సీజేఐగా చివరి కార్యక్రమం కూడా ఏపీ రాజధాని అమరావతిలోనే కావడం విశేషం అన్నారు.

ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే కోర్టులను ఆశ్రయించే హక్కు రాజ్యాంగం ఇచ్చిందని, సాంఘిక, ఆర్థిక న్యాయ సాధన కోసం రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలను పొందుపరిచారని సీజేఐ జస్టిస్ బీఆర్ గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభకు అప్పగిస్తూ అంబేడ్కర్ చేసిన ప్రసంగం ప్రతి న్యాయవాదికి కంఠోపాఠం కావాలన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని ఓ స్థిర పత్రంగా భావించలేదని, కాలానుగుణంగా మార్పులు అవసరమనే భావించారు. అంశం ప్రాధాన్యతను బట్టి రాజ్యాంగ సవరణ విధానాలను అంబేడ్కర్ ఏర్పాటు చేశారని, కొన్ని అంశాల్లో రాజ్యాంగం సవరణ సులభం.. మరికొన్ని అంశాల్లో అది చాలా కఠినం అని సీజేఐ జస్టిస్ తెలిపారు.

రాజ్యాంగం అమల్లోకి వచ్చిన మరుసటి ఏడాదే రిజర్వేషన్ల అంశంపై మొదటి రాజ్యాంగ సవరణ జరిగిందని, రాజ్యాంగ సవరణ అంశంపై కేంద్రానికి, సుప్రీంకోర్టుకు మొదట్లో కొంత ఘర్షణ వాతావరణం ఏర్పడిందన్నారు. కేశవానంద భారతి కేసులో సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూపం అనే భావనను తీసుకొచ్చింది. దీంతో రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని సవరించరాదని సుప్రీం చెప్పినట్లు ఆయన వెల్లడించారు. 1975 వరకూ ఆదేశిక సూత్రాలకంటే ప్రాథమిక హక్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఉండేదన్నారు.

కేశవానంద భారతి కేసు తర్వాత ప్రాథమిక హక్కులతో పాలు ఆదేశిక సూత్రాలకూ సమ ప్రాధాన్యం దక్కిందని జస్టిస్ బీఆర్ గవాయ్ వివరించారు. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతేడాది ఏడుగురు జడ్జీల సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలోనూ క్రీమిలేయర్ విధానం ఉండాలన్నది నా అభిప్రాయం వ్యక్తం చేశారు. బడుగు వర్గాలకు, మహిళలకు విద్య అందించేందుకు జ్యోతి బాపులే, సావిత్రి బాయిపులే కృషి చేశారు. జ్యోతి బాపులేను అంబేడ్కర్ తన గురువుగా భావించేవారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్నారు.