02-06-2025 05:17:34 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ లో మంగళవారం నుండి పదవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు మొదలవుతున్నాయని జిల్లా ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ముడారపు పరమేశ్వర్(Mudarapu Parameshwar) తెలిపారు. జిల్లాలో 312 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ విద్యార్థులందరూ నిర్మల్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవార్పేట్లో పరీక్ష రాస్తారని తెలియజేశారు. పరీక్ష నిర్వహణ కోసం చీఫ్ సూపర్డెంట్ ను, డిపార్ట్మెంట్ అధికారులు, సిట్టింగ్ స్క్వాడ్ తో పాటు ఇన్విజిలేటర్ లను నియమించినట్లు వివరించారు. పరీక్షలు సీసీ కెమెరా పర్యవేక్షణలో జరగనున్నాయని తెలిపారు. విద్యార్థులు ప్రతిరోజు అరగంట ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.
ఐదు నిమిషాలకు మించి ఆలస్యమైతే విద్యార్థులను పరీక్ష రాసేందుకు అనుమతించేది లేదని చెప్పారు. విద్యార్థుల హాల్ టికెట్లు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో కలవని వాటిని విద్యార్థులు గాని, ఆయా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కానీ డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలియజేశారు, అలా వీలుకాని పక్షంలో జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో కూడా హాల్ టికెట్లు అందుబాటులో కలవని వెల్లడించారు. ప్రతిపరీక్ష కేంద్రంలో మెడికల్ సిబ్బంది అంగన్వాడి సిబ్బందితో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారని తెలిపారు.
వికలాంగుల కొరకై వీల్ చైర్ ను అందుబాటులో ఉంచినట్టు వెల్లడించారు. రేపటి నుండి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం నిర్మల్ లో ఏకైక కేంద్రమైన ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల సోమవారపేట యందు ఏర్పాట్లు అన్ని పూర్తయినట్లు వెల్లడించారు. ఈ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల వరకు నిర్వహించబడతాయని వెల్లడించారు. ఏడు రోజులపాటు జరగనున్న ఈ పరీక్ష సమయాలలో పరీక్ష కేంద్రం వద్ద 144 సెక్షన్ ను రెవెన్యూ అధికారులు అమలు చేస్తుందని, ఆ సమయంలో జిరాక్స్ సెంటర్లు కూడా మూసి వేయబడి ఉంటాయని తెలిపారు