22-06-2025 12:53:43 AM
- కేటీఆర్ను ఎందుకు విచారించరు!
- సీబీఐకి అప్పగిస్తే ఫోన్ ట్యాపింగ్ దోషులను ఎప్పుడో జైల్లో వేసేవాళ్లం
- సిట్ విచారణకు సహకరిస్తా: కేంద్ర మంత్రి బండి సంజయ్
కరీంనగర్, జూన్ 21 (విజయక్రాంతి): కేసీఆర్ చెబితేనే ఫోన్ ట్యాపింగ్ చేశామని ఏసీబీకి రాధాకిషన్రావు స్వయంగా వాంగ్మూలమిచ్చిన తర్వాత కూడా కేసీఆర్కు ఎందుకు నోటీసులివ్వడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. సిరిసిల్ల కేంద్రంగా తన ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తేలినా కేటీఆర్కు ఎందుకు నోటీసులిచ్చి విచారించడం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ఎందుకు వెనుకడుగు వేస్తున్నదని నిలదీశారు.
కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారీ ఒప్పందం ఏమైనా ఉందా అని అనుమానం వ్యక్తం చేశారు. కాగా ఫోన్ ట్యాపింగ్పై సిట్ నుంచి తనకు ఫోన్ కాల్ వచ్చిన మాట నిజమేనని, విచారణకు సహకరిస్తానని చెప్పారు. చట్టప్రకారం నడుచుకుంటానని బండి సంజయ్ కుమార్ తెలిపారు. శుక్రవా రం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు పీసీసీ అధ్యక్షుడి హోదా లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేసిన రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చాక ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు.
“ఒకవేళ సీబీఐ నేరుగా విచారణ జరిపే అవకాశముంటే ఈ కేసును ఎప్పుడో తేల్చేసే వాళ్లమని, ప్రభాకర్రావు లాంటోళ్లకు రాచమర్యాదలిస్తామా? ఆయనతోపాటు కేసీఆర్, కేటీఆర్ సహా దోషులందరినీ గుంజుకుపోయి జైళ్లో వేసేవాళ్లం” అని వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఎవరున్నారో ప్రజలందరికీ తెలుసని, సిరిసిల్లనే ఎందు కు కేంద్రంగా ఎంచుకున్నారో కూడా అందరికీ తెలుసన్నారు.
ప్రభాకర్రావు అనేక మంది జీవితాలను నాశనం చేశాడని, తనతోసహా బీజేపీ నేతలందరి ఫోన్లను ట్యాప్ చేసిన నీచుడు అని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాతే ప్రభాకర్రావు విదేశాలకు పారిపోయాడని ఆరోపించారు. ప్రభాకర్రావు, రాధాకిషన్రావులు బీజేపీతో పాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల ఫోన్లు మాత్రమే కాదని, జడ్జీల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ కోరాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.