24-05-2025 08:12:29 AM
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షకార్యదర్శులు మంద. నాగక్రిష్ణ , బయ్య అభిమన్యు
భద్రాద్రి కొత్తగూడెం (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో గల 12 ఇంటర్మీడియట్ గురుకులాలను విద్యార్థులు లేరనే నెపంతో సర్కారు మూసివేయాలని చూస్తోందని , ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనుకకు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మంద. నాగక్రిష్ణ , బయ్య అభిమన్యు డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా వారు కొత్తగూడెంలో మాట్లాడుతూ ముఖ్యంగా ఈ గురుకులాలలో పేద , బలహీన వర్గాల నుండి వచ్చిన విద్యార్థులు చదువుతున్నారని వీటిని మూసి వెయ్యడం ద్వారా వారు విద్యకు దూరం అవుతారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యాసంస్థలను మూసి వేసి ప్రైవేట్ , కార్పొరేట్ విద్యసంస్థలకు కట్టబెట్టేలా రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని వారు మండి పడ్డారు. ఈ మూసివేసే విద్యాసంస్థలలో భద్రాచలం గురుకులం కూడా ఉందని ఏజెన్సీ ప్రాంత విద్యార్థులు ఇందులో చదువుతున్నారని దీనిని మూసివేయడం ద్వారా వారి తమ విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ విద్య వ్యవస్థను అభివృధి చేయాల్సిన ప్రభుత్వమే వాటిని మూసివేయడం సిగ్గుచేటు అని ఈ నిర్ణయాన్ని తక్షణమే వెనుకకు తీసుకోవాలని లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని వారు హెచ్చరించారు.