calender_icon.png 31 May, 2025 | 12:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాసిపేట గురుకులానికి సీఎం రూ.ఐదు లక్షలు గిఫ్ట్..

29-05-2025 04:33:03 PM

టెన్త్,ఇంటర్ లో 100% ఫలితాలు..

ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ కు సీఎం ప్రశంసలు..

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలోని 100% టెన్త్, ఇంటర్లో ఫలితాలు సాధించిన కాసిపేట గురుకులానికి సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రూ. ఐదు లక్షలు గిఫ్ట్ ఇచ్చారు. ఈ మేరకు ఫలితాలు సాధించిన కాసిపేట గురుకులానికి ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.ఐదు లక్షల చెక్కును పాఠశాల ప్రిన్సిపాల్ ఊటూరి సంతోష్ కుమార్(Ooturi Santosh Kumar) అందుకున్నారు. తెలంగాణ సాంఘిక సంక్షేమ కాసిపేట బాలుర పాఠశాల, కళాశాల ప్రిన్సిపాల్ ఉటూరి సంతోష్ కుమార్ హైదరాబాదులో ముఖ్యమంత్రి చేతుల మీదుగా రూ.ఐదు లక్షల చెక్కును, ప్రశంసా పత్రం అందుకున్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ సంతోష్ కుమార్ మాట్లాడుతూ... ఇటీవల వెలువడిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ లో నూటికి నూరు శాతం ఫలితాలు సాధించడం ఎంతో గర్వంగా ఉందన్నారు. సుషిక్తులైన ఉపాధ్యాయుల బోధనా మార్గదర్శకంలో విద్యార్థులు అహర్నిశలు  కష్టపడి చదివి గురుకుల పాఠశాల కళాశాలకు పేరు తెచ్చారన్నారు. విద్యార్థులు సాధించిన ప్రతిభా ఘనతకు సీఎం రేవంత్ రెడ్డి రూ. ఐదు లక్షలు వారితోషకం, ప్రశంస పత్రం అందజేయడం సాధించిన ఫలితాలకు తగిన గుర్తింపు లభించింది అన్నారు. హైదరాబాద్ బంజారా హిల్స్ లో గల బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో సీఎం చేతుల మీదుగా రూ. ఐదు లక్షలు అందుకున్న 239 సాంఘిక సంక్షేమ  గురుకులాలలో వంద శాతం సాధించిన 14 గురుకులాల్లో బెల్లంపల్లి కాసిపేట గురుకులం ఉండడం హర్షనీయమన్నారు. 

విద్యార్థుల ఉత్తీర్ణత..

పదవ తరగతి ఫలితాలలో స్కూల్ టాపర్ గా సిహెచ్ చైతన్య 549, అలాగే 500 పైగా మార్కులు 22 మంది విద్యార్థులు సాధించారు. విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంచడానికి ప్రభుత్వం డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచడం, కామన్ డైట్ మెనూ అమలు చేయడం వలన విద్యార్థులు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండి చదువు పట్ల దృష్టి సారించడం జరుగుతుందనీ ప్రిన్సిపాల్ సంతోష్ తెలిపారు. మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషిచేసిన పదవ తరగతి, ఇంటర్మీడియట్ విద్యార్థులను, ఉపాధ్యాయులను అభినందించారు.

ఈ స్ఫూర్తితో భవిష్యత్తులో ఇంతకన్నా మంచి ఫలితాలు సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. నూరు శాతం ఫలితాలను సాధించిన ప్రిన్సిపాల్ లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బెల్లంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే గడ్డం వినోద్ , సాంఘిక సంక్షేమ గురుకుల కార్యదర్శి అలుగు వర్షిని, కాలేశ్వరం జోన్ -1అధికారిని అరుణ కుమారి ప్రత్యేకంగా అభినందించారు.