మనుమడి కోసం సీఎం పూరీలు
- తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా.. ఎక్స్లో పోస్టు
- ముద్దు ముద్దు మాటలకు మురిసిపోయిన రేవంత్రెడ్డి
హైదరాబాద్, జూలై 9 (విజయక్రాంతి) : ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన మనమడు రుద్రదేవ్ కోసం తన బీజీ షెడ్యుల్ను పక్కన పెట్టి వంటగదిలోకి వెళ్లి స్వయంగా పూరీలు చేశారు. పరిపాలన, రాజకీయ వ్యవహారాలతో నిత్యం బిజీగా ఉండే సీఎం.. కాసేపు తన మనవడి కోసం గరిటె పట్టారు. తాతా.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా అని మనవడు ముద్దు ముద్దుగా అడగడంతో .. మనమడి కోసం కిచెన్లోకి ఎంట్రీ ఇచ్చి స్వయంగా షెఫ్గా మారిపోయారు.
మనమడి కోసం తాను పూరీలు చేస్తున్న మధుర క్షణాలకు సంబంధించిన వీడియోను సీఎం రేవంత్రెడ్డి స్వయంగా ఎక్స్(ట్విట్టర్) వేదికగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఒక ఎమోషనల్ క్యాప్షన్ రాసుకొచ్చారు ‘తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా’ అని మనమడు అడిగితే తప్పుతుందా..? పక్కన మనవడు, చేతిలో పిడికెడు పిండి, దోసిట్లో నవ్వులు, గుండ్రంగా లేని డజన్ పూరీలు... బిజీ బిజీగా సాగుతున్న ప్రజా జీవితంలో.. మనమడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాలు, మధుర జ్ఞాపకాలు’ అని రేవంత్రెడ్డి ఒక వీడియోన్ ట్వీట్ చేశారు. కాగా, ఈ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసిన కొద్దిసేపటికే విపరీతంగా వైరల్గా మారింది.
దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. రాష్ట్రానికి ముఖ్య మంత్రి అయినా.. మనమడికి మాత్రం తాతేనని, నిత్యం ప్రజాసేవలో అలసిపోయే మీకు ఇలాంటి చిన్నచిన్న సంతోషాలు తీపి గుర్తులు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా, రేవంత్రెడ్డి ఏకైక కుమార్తె నైమిషారెడ్డి కుమారుడు అంటే రేవంత్రెడ్డికి ఎప్పుడూ స్పెషలే. తన మనమడికి వారి అమ్మానాన్న రేయాన్స్ అని పేరు పెట్టుకుంటే రేవంత్రెడ్డి మాత్రం స్పెషల్గా రుద్రదేవ్ పెట్టుకున్నాడు.
తాను తన స్వగ్రామానికి వెళ్లినా, దైవదర్శనాలకు వెళ్లినా తనతో పాటు తన మనమడిని రేవంత్రెడ్డి వెంట తీసుకుని వెళ్తారు. ఇటీవలే తన మనుమడికి రేవంత్రెడ్డి బాసర సరస్వతి అమ్మవారి క్షేత్రంలో అక్షరాభ్యాసం కూడా చేయించారు. ఇప్పుడు ఏకంగా పూరీలు కా వాలని అడగడమే ఆలస్యం.. రేవంత్రెడ్డి కి చెన్ రూమ్లోకి ఎంట్రీ ఇవ్వడం అక్కడ తన మనువడి ముద్దు ముద్దు మాటలకు మురిసిపోవడం అందరినీ ఆకట్టుకుంటోంది.






