calender_icon.png 6 August, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తోంది: సీఎం రేవంత్

06-08-2025 07:15:26 PM

న్యూఢిల్లీ: ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన పోరుబాట ధర్నా కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddyప్రసంగించారుస్థానిక సంస్థలు, విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభ తీర్మానించిన రెండు బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని సీఎం రేవంత్ రాష్ట్రపతిని, కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దని అడ్డుగా ఉన్న పరిమితి తొలగిస్తూ సంబంధిత చట్టాన్ని సవరిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ కు కూడా ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్ లో ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన పలువురు పార్లమెంట్ సభ్యులు పాల్గొని ఓబీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న తెలంగాణ సంకల్పానికి మద్దతును ప్రకటించారు. 

ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ పోరుబాట కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, 4 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా శాసనసభలో విద్య, ఉద్యోగ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు ఆమోదముద్ర వేయాలని డిమాండ్ చేశారు. “రాబోవు రోజుల్లో దేశవ్యాప్తంగా చేపట్టే జనగణనలో కులగణన తెలంగాణ నమూనా దేశానికి ఆదర్శంగా, రోల్ మాడల్ గా నిలుస్తుందని, ఫిబ్రవరి 4, 2024 రోజున ప్రారంభించి సరిగ్గా ఏడాది కాలంలో 4 ఫిబ్రవరి 2025 నాటికి సర్వే పూర్తి చేసి రిజర్వేషన్లు కల్పిస్తూ పరిష్కార మార్గం చూపించామని అన్నారు. ఆ రిజర్వేషన్లను సాధించుకోవడానికే సడక్ నుంచి సంసద్ వరకు వచ్చామని, యావత్ దేశం ఇప్పుడు తెలంగాణ వైపు చూస్తోందన్నారు. వందేళ్లలో ఇలాంటి ప్రక్రియ చేపట్టలేదు. రాష్ట్రాలను పాలించిన దాదాపు మూడు వందల మంది ముఖ్యమంత్రులు ఎవరూ చేయలేని సాహసం తెలంగాణ మంత్రిమండలి విజయవంతంగా పూర్తి చేసిందన్నారు.

తెలంగాణ శాసనసభ చేసిన బిల్లులు, రిజర్వేషన్లపై 50 శాతం పరిమితిని తొలగిస్తూ జారీ చేసిన ఆర్డినెన్స్ గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి చేరి నాలుగు నెలలైనా ఆమోదముద్ర పడలేదని, ఆ నేపథ్యంలోనే చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం సంకల్పించిన బీసీ రిజర్వేషన్లకు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది పార్లమెంట్ సభ్యులు మద్దతుగా నిలబడ్డారన్నారు. జంతర్ మంతర్ ధర్నాతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు దక్కుతాయని నాకు సంపూర్ణ విశ్వాసం ఉందని, మా డిమాండ్ ను ఆమోదించాలి.. రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోం.. అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ఈ రిజర్వేషన్ల కోసం ఢిల్లీలో నినదించిన విషయాలను తెలంగాణ గ్రామ గ్రామాన చేరవేయాలని, ఒక గొప్ప లక్ష్యంతో ఢిల్లీ వేదికగా పోరాటం సాగిస్తున్నామని, రాష్ట్రపతి మా బిల్లులను వెంటనే ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ధర్నా కార్యక్రమంలో డీఎంకే, సమాజ్ వాది, ఎన్సీపీ, శివసేన, వామపక్ష పార్టీలకు చెందిన పార్లమెంట్ సభ్యులు పాల్గొని తెలంగాణ సంకల్పించిన 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతును ప్రకటించారు.