సినిమా టికెట్లు పెంపు.. 20 శాతం కార్మికులకు ఇవ్వాలి
హైదరాబాద్: హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు వేదిక కావాలనేది నా సంకల్పం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యనించారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలు ఎలాగో.. ఫిల్మ్ ఇండస్ట్రీకి కూడా అంతే అని, మీరు అండగా ఉంటే హాలీవుడ్ ను కూడా హైదరాబాద్ కు తీసుకువస్తామని తెలిపారు. హాలీవుడ్ సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో, హైదరాబాద్ లో షూటింగ్ లు జరిగేలా బాధ్యత తీసుకుంటామన్నారు. భారత్ ఫ్యూచర్ సిటీలో సినీపరిశ్రమకు ప్రాధాన్యత ఉండేలా చర్యలు తీసుకుంటామని, సినీకార్మికుల పిల్లల కోసం కార్పొరేట్ స్థాయి పాఠశాల నిర్మించి నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచితంగా చదువు చెప్పిస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా సినీ కార్మికులకు ఉచిత వైద్యం అందిస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు.
సినీ కార్మికుల కోసం ప్రభుత్వం తరుపున చేయగలిగిన పనులు చేస్తామని, వారికి వెల్ఫెర్ ఫండ్ ఏర్పాటు చేసి ప్రభుత్వ తరపున రూ.10 కోట్లు డిపాజిట్ చేస్తామని చెప్పారు. సినిమా టికెట్లు పెంపు ద్వారా వచ్చిన ఆదాయంలో 20 శాతం కార్మికులకు ఇస్తానంటే ప్రభుత్వ తరుపున జీవో ఇస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే సినీ కార్మికుల అసోషియేషన్ తో మాట్లాడి వారి ఇళ్లు స్థలాలు ఇస్తామని, సిని కార్మికుల భవన్ నిర్మాణానికి స్థలం ఇస్తామన్నారు. ఫైటర్స్, సినీ కార్మికుల ప్రాక్టీస్ కు ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లు చేసి వారి సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది అని సీఎం వెల్లడించారు. నిర్ణయం తీసుకునే వరకే ఆలోచిస్తా.. నిర్ణయం తీసుకున్నాక ఆలోచించను అమలు చేస్తామని తెలిపారు. నవంబర్ చివరి వారంలో సినీ కార్మికులతో మాట్లాడతామని సీఎ రేవంత్ రెడ్డి వివరించారు.






