మహిళా సంఘాల సభ్యుల నమూనా చీరలను పరిశీలించిన ముఖ్యమంత్రి
హైదరాబాద్,(విజయక్రాంతి): రాష్ట్రంలోని 63 లక్షల మంది మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ద్వారా ఉచితంగా పంపిణీ చేయనున్న చీరల నమూనాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర చేనేత సహకార సంఘం ద్వారా తయారు చేయించి ఏడాదికి రెండు చీరల చొప్పున ఉచితంగా పంపిణీ చేయాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో వాటి నమూనాలను సీఎం ఇవాళ అసెంబ్లీలోని ఆయన చాంబర్ లో పరిశీలించారు.
మహిళా శక్తి లోగో, రంగులతో కూడిన చీరలను ఆకర్షణీయంగా రూపొందించాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించినట్లుగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలకు కూడా యూనిఫామ్ చీరలు అందించాలని, అందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సలహాదారు వేం నరేంద్ రెడ్డి , పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.






