28-05-2025 03:05:57 PM
హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బాబూ జగ్జీవన్ రామ్ భవన్( Babu Jagjivan Ram Bhavan)లో గురుకుల అవార్డుల కార్యక్రమం( Gurukula Awards Function) నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, గడ్డం ప్రసాద్ పాల్గొన్నారు. పదో తరగతి, ఇంటర్ లో టాపర్స్ గా నిలిచిన విద్యార్థులు, క్రీడల్లో జాతీయ, రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థులను, ఐఐటీ, నీట్ ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన విద్యార్థులను సీఎం సన్మానించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... గురుకులాలకు చెందిన పలువురు ఉపాధ్యాయులను రేవంత్ రెడ్డి అభినందించారు. కోఠిలోని మహిళా కళాశాలకు వీరనారి చాకలి ఐలమ్మ పేరు పెట్టుకున్నామని తెలిపారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్లు అమలు చేసుకుంటున్నామని చెప్పారు. పాలితులుగా ఉన్న ఎస్సీ, ఎస్టీలను పాలకులుగా మార్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. సమాజంలో రుగ్మతులు, అసమానతలు తొలగించాల్సిన అవసరం ఉందన్నారు.
చాలామంది మహనీయులకు గుర్తింపు తెచ్చింది కులం కాదు.. చదువు మాత్రమేనని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే చదువులతోనే సాధ్యమతుందని సూచించారు. కార్పొరేట్ విద్య సంస్థలతో పోటీ పడేలా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఒక విద్యార్థి చదువు, ఆరోగ్యం బాగుండాలంటే పరిసరాలు, మౌలిక వసతులు కూడా బాగుండాలని సీఎం సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలకు చదువులు వద్దు.. కులవృత్తులు మాత్రమే చేసుకోవాలని గత పాలకులు భావించారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. దళితులు, బీసీలు గొర్రెలు, బర్రెలు, చేపలు పెంచుకుంటూ ఉండాలన్నట్లుగా మాజీ సీఎం వ్యవహిరించారని సీఎం విమర్శించారు. తెలంగాణ(Telangana) వస్తే.. ఉద్యోగాలు వస్తాయని భావించిన యువత ఆశలపై నీళ్లు చల్లారని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ సీఎం తన ఇంట్లో ఉద్యోగాలు ఇచ్చుకున్నారు గానీ.. రాష్ట్రంలోని పేదలకు మాత్రం ఉద్యోగాలు ఇవ్వలేదని ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. తన ఇంట్లో వాళ్లు ఒక చోట ఓడిపోతే మరోచోట పదవులు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చుకున్నారని ధ్వజమెత్తారు.
ఈ ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే 55 వేల ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేసిందని పేర్కొన్నారు. ఇంకా ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత సంఖ్య లక్షల్లో ఉందని చెప్పారు. ఉద్యోగాల భర్తీ త్వరగా పూర్తయితే ఉద్యోగం రానివారు మరో పని చూసుకుంటారని తెలిపారు. ఉద్యోగాల భర్తీ త్వరగా జరగకుండా కొందరు కుట్రలు చేస్తున్నారు.. కోర్టుల్లో కేసులు వేసి ఉద్యోగాల భర్తీని అడ్డుకుంటున్నారని సీఎం ఆరోపించారు. నోటి కాడికి వచ్చిన ముద్ద లాక్కున్నట్లుగా కేసులు వేస్తున్నారని వివరించారు. ఉద్యోగాలను అడ్డుకుంటున్న వారిని ప్రజలు నిలదీయాలని సీఎం పిలుపునిచ్చారు. ఆర్నెళ్లు కూడా విరామం లేకుండా వాళ్ల ఉద్యోగాలు భర్తీ చేసుకుంటున్నారు.. విద్యార్థులకు మాత్రం సంవత్సరాల తరబడి ఉద్యోగాలు దక్కుకుండా చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సివిల్స్ మెయిన్స్ కు ఎంపికైన వారికి లక్ష రూపాయలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.