22 May, 2026 | 2:56 AM

ఈడీ ఆఫీస్ ముందు సీఎం రేవంత్ రెడ్డి నిరసన

22-08-2024 02:31 PM

హైదరాబాద్‌: సెబీ చైర్‌పర్సన్‌ మధబి పూరి బుచ్ ఆస్తులపై ఈడీ విచారణ జరిపించాలని డిమాండ్‌ చేస్తూ గన్‌పార్క్‌ సమీపంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కార్యాలయం వద్ద ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర సీనియర్‌ నేతలు గురువారం ప్రదర్శన నిర్వహించారు. రేవంత్ రెడ్డి, ఇతర నేతలు ఈడీ కార్యాలయం వద్ద బైఠాయించి ప్రదర్శనలో పాల్గొన్నారు. ఇడి కార్యాలయాల వద్ద నిరసనలు చేపట్టాలని రాష్ట్రంలోని నాయకులందరికీ అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఎఐసిసి) పిలుపు మేరకు వారు ఇందులో పాల్గొన్నారు. సత్యమే గెలుస్తుంది అనే నినాదంతో పోస్టర్లు పట్టుకుని కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ నేతలు నినాదాలు చేశారు. పార్టీ నేతలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ... ఈ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పట్టించుకోవడంలో విఫలమయ్యారని విమర్శించారు. హిండెన్‌బర్గ్ పరిశోధన నివేదికను ఉటంకిస్తూ, దేశంలో ఆర్థిక వనరుల దోపిడీని నివేదిక స్పష్టంగా బట్టబయలు చేసిందని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత దేశం అప్పుల ఊబిలోకి జారిపోయిందని ఆరోపించారు.