సిగాచి పరిశ్రమకు సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) మంగళవారం నాడు ఉదయం 10 గంటలకు సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమకి(Sigachi Industries) వెళ్లనున్నారు. పటాన్ చెరు ధ్రువ ఆస్పత్రిలో(Dhruva Hospitals) పరిశ్రమలో గాయపడి చికిత్స పొందుతున్న కార్మికులను ముఖ్యమంత్రి పరామర్శించనున్నారు. అనంతరం అగ్నిప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరిశీలించనున్నారు. సహాయ చర్యలు పర్యవేక్షించి, క్షతగాత్రులను సీఎం పరామర్శించనున్నారు.
సంగారెడ్డి పాశమైలారం పారిశ్రామికవాడలోని ఒక రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంపై ముఖ్యమంత్రి సోమవారం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై ముఖ్యమంత్రి విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో చిక్కుకున్న కార్మికులను కాపాడటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని, గాయపడిన వారికి అత్యవసర వైద్యసహాయం అందించాలని అధికారులను ఆదేశించారు. అటు పాశమైలారం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 35 కు చేరింది. మరో 32 మంది కార్మికులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు.






