19 August, 2026 | 8:12 PM

భూత్పూర్‌లో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ తనిఖీ చేసిన సీఎండీ

19-08-2026 07:17 PM

భూత్పూర్: మండల పరిధిలోని 33/11 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను టీజీఎస్పీడీసీఎల్‌ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వి. జితేష్‌  పాటిల్‌, జిల్లా కలెక్టర్‌ ఖుష్బూ గుప్తాతో కలిసి బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సబ్‌స్టేషన్‌ పని తీరును పరిశీలించిన సీఎండీ సబ్‌స్టేషన్‌పై ఉన్న విద్యుత్‌ లోడ్‌, ప్రస్తుతం కొనసాగుతున్న విద్యుత్‌ సరఫరా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. సబ్‌స్టేషన్‌ నుంచి ఎన్ని గ్రామాలకు విద్యుత్‌ సరఫరా జరుగుతోంది.

ఆయా ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరాలో ఏమైనా అంతరాయాలు, వోల్టేజీ సమస్యలు ఉన్నాయా అనే వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యుత్‌ వినియోగం డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, వినియోగదారులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరా అందేలా చర్యలు చేపట్టాలని సీఎండీ అధికారులకు సూచించారు. సబ్‌స్టేషన్‌ పరిధిలోని గ్రామాల విద్యుత్‌ సరఫరా పరిస్థితులు, సాంకేతిక సమస్యలు, లోడ్‌ వివరాలను అధికారులు సీఎండీకి వివరించారు. ఈ తనిఖీలో టీజీఎస్పీడీసీఎల్‌ ఎస్.ఈ.భీమనాయక్, డి.ఈ చంద్ర మౌళి, విద్యుత్‌ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.