సీఎంఆర్ బియ్యం సరఫరా వేగవంతం చేయాలి
మిల్లర్ల సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్
యాదాద్రి భువనగిరి మార్చి 13 ( విజయ క్రాంతి): 2023-24 సీజన్ లో మిల్లర్లు ప్రభుత్వానికి సిఎంఆర్ బియ్యాన్ని అందజేయడానికి తుది గడువు ఈ నెల 17 తేదీ వరకు ఉన్నందున సిఎంఆర్ బియ్యం డెలివరీ వేగవంతం చేయాలని, రెవిన్యూ అదనపు కలెక్టర్ వీరారెడ్డి అన్నారు.
గురువారం రోజు తన ఛాంబర్ లో రైస్ మిల్లర్స్, అధికారులతో తో ఏర్పాటు చేసిన సమావేశంలో అదనపు కలెక్టర్ మాట్లడుతూ యాదాద్రి భువనగిరి జిల్లాలో 96 శాతం బియ్యం డెలివరీ పూర్తి అయ్యినందున మిగతా 4 శాతం బియ్యం తుది గడువు లోపు పంపి జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. ఖరీఫ్ ధాన్యానికి సంబందించి ఇంకా బియ్యం డెలివరీ చేయనివాళ్లు వెంటనే మొదలు పెట్టాలని తెలిపారు.
ఎవరైనా మిల్లర్లు ప్రభుత్వ ధాన్యాన్ని దుర్వినియోగం చేస్తే అట్టి వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అంతేకాకుండా ఇప్పటినుంచి జిల్లా లో ఏర్పాటు చేసిన తనిఖీ బృందాలు మిల్లులను చెక్ చేసి నివేదికలు ఎప్పటికప్పుడు సమర్పించాలని ఈ సందర్భంగా కోరారు. మిల్లర్లు కూడా బియ్యం డెలివరీ వేగవంతం చేసిన ఎడల రానున్న యాసంగి పంట కాలంలో వచ్చే ధాన్యానికి తగు స్థలం ఏర్పడుతుందని అదేవిధంగా ఇప్పుడు బియ్యం సరఫరా పూర్తి చేయని మిల్లర్లకు ఎట్టి పరిస్థితులలోనూ ధాన్యం కేటాయింపులు చేయమని తెలియజేశారు.
జిల్లా మిల్లర్లు తాము దించుకున్న ధాన్యానికి గాను సరిపడు బ్యాంకు గ్యారంటీని ఇవ్వాలని, రభీ 2022-23 వేలం ధాన్యమునకు గాను తగు చెల్లింపులు పూర్తి చేసి జిల్లాను అగ్రస్థానంలో నిలబెట్టాలని కోరారు. ఈ సమావేశ లో జిల్లా మిల్లర్ ప్రెసిడెంట్ మార్త వెంకటేశం, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్, డి. హరికృష్ణ, జిల్లా పౌర సరఫరాల అధికారి కె.వనజాత, ఇతర అధికారులు పాల్గొన్నారు.






