సహాయనిధి పథకం సరళతరం చేయాలి
ప్రైవేటు ఆస్పత్రులపై చర్యలు తీసుకోవాలి
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
84 మంది లబ్దిదారులకు రూ.32.25 లక్షల విలువ చేసే చెక్కులు అందించిన ఎమ్మెల్యే
భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): అత్యవసర పరిస్థితిలో సొంత ఖర్చులతో ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్న పేద వర్గాలకు ప్రభుత్వం ద్వారా అందించే ముఖ్యమంత్రి సహాయనిధి పథకాన్ని ప్రతి ఒక్కరు అందుకునేవిధంగా సులభతరం చేయాలని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు(Kothagudem MLA Kunamneni Sambasiva Rao) ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి సహాయనిధి పథకానికి(Chief Minister Relief Fund Scheme) దరఖాస్తు చేసుకున్న 84 మంది లబ్దిదారులకు రూ.32.25 లక్షల విలువచేసే చెక్కులను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్బంగా ఏర్పాటైన సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ... ఇప్పటివరకు నియోజకవర్గంలో 1505 మందికి రూ.3.16 కోట్ల విలువచేసే చెక్కులు అందించామని, 800 మందికి పంపిణి కావాల్సివుందన్నారు.
మరో 310 మంది రోగులకు నిమ్స్ ఆస్పత్రి(NIMS Hospital) ఎల్వోసీ ద్వారా ముందస్తు వైద్య ఖర్చులు మంజూరు చేయించడం జరిగిందని తెలిపారు. సిఎంఆర్ఎఫ్ దరఖాస్తుదారులు(CMRF Applicants) కొన్ని ఆస్పత్రులు ఇబ్బందులకు గురిచేస్తున్నాయని, ప్రాథమిక ఆమోదం విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్నారని, కొన్ని ఆస్పత్రుల యాజమాన్యాలకు ఈ పథకంపై ఎలాంటి అవగాహన లేకపోవంతో దరఖాస్తుదారులు నష్టపోవాల్సి వస్తోందని, వీరిపై ప్రభుత్వం చేర్యాలకు సిఫారసు చేయాలని కోరారు. నిధి మంజూరులో ప్రభుత్వం పరిమితి విధించడం సరికాదని తక్షణమే పరిమితి ఎత్తివేసి పూర్తి బిల్లును చెల్లించాలని కోరారు.






