యూపీఏ హయాంలోనే బొగ్గు కుంభకోణం
బీజేపీ నేత సోగల కుమార్
హైదరాబాద్, జూన్ 21 (విజయక్రాంతి): బొగ్గు దందాకు పాల్పడింది కాంగ్రెస్ పార్టీయేనని, యూపీఏ హయాంలోనే బొగ్గు కుంభకోణం జరిగిందని బీజేపీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు గురించి తెలియని కంపెనీలకు 121 బొగ్గు బ్లాకులను అంటగట్టిన ఘనత యూపీఏ సర్కారుదని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు తీర్పుతో వాటిని రద్దు చేశారని గుర్తు చేశారు. 2015లో ప్రధాని మోదీ కొత్త మైనింగ్ చట్టాన్ని తీసుకొచ్చారని, ఆ చట్టానికి అనుకూలంగా బీఆర్ఎస్ ఎంపీలూ ఓటేశారన్నారు. అత్యంత పారదర్శకంగా ఇప్పటికే 80 వరకు బ్లాకులను తమకే కావాలని దరఖాస్తు పెట్టిన వారికి అవకాశం లభించిందన్నారు. కానీ తెలంగాణలోని 4 బ్లాకులు మాకే కావాలని ఇక్కడి బీఆర్ఎస్ సర్కారు దరఖాస్తు చేసుకోలేదని గత కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారని గుర్తు చేశారు.






