3 April, 2026 | 3:27 AM

మెనూ ఉల్లంఘనపై కలెక్టర్ ఆగ్రహం

03-04-2026 01:35 AM

హెచ్‌ఎం, వార్డెన్‌కు షోకాజ్ నోటీసులు 

అశ్వాపురం, ఏప్రిల్ 2 (విజయక్రాంతి):  విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పథకంలో నిర్దేశించిన మెనూ ప్రకారం అమలులో రాజీ లేదని, అశ్వాపురం మండలం గొందిగూడెం గిరిజన సంక్షేమ బాలుర ఉన్నత పాఠశాల లో మెనూ అమలు చేయడం లేదని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెనూ ప్రకారం విద్యార్థులకు ఇవ్వాల్సిన క్యారెట్, ఎగ్ ఫ్రై అందించకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కిచెన్, కూరగాయల నిల్వ గది, స్టోర్ రూమ్, కంప్యూటర్ ల్యాబ్, మరుగుదొడ్ల నిర్వహణలో శుభ్రత లోపాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.మెనూ పాటించని ప్రధానోపాధ్యాయులు రామారావు, వార్డెన్లకు షోకాసు నోటీసులు జారీ చేస్తూ, ఒకరోజు వేతనాన్ని రికవరీ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గురువారం కలెక్టర్ మండలంలో విస్తృతంగా పర్యటించి  విద్య, వైద్యం, సంక్షేమం, వ్యవసాయ రంగాలకు సంబంధించిన పలు అంశాలను సమీక్షిస్తూ సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.

ముందుగా మల్లెలమడుగు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన ఆయన, ప్రశ్నపత్రాల పంపిణీ, భద్రతా ఏర్పాట్లు, తాగునీరు, విద్యుత్, శౌచాలయాల వంటి ప్రాథమిక సదుపాయాలను పరిశీలించి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో, పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మందుల గది, ల్యాబ్, ఇన్పేషెంట్, ఔట్పేషెంట్, వ్యాక్సినేషన్ విభాగాలను పరిశీలించి రోగులకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు.

అనంతరం నెల్లిపాక బంజర గ్రామంలోని జెఎన్జె అగ్రి ఫారంను సందర్శించి రైతులు విజయనిర్మలక్రీస్తు రాజు దంపతులు సాగు చేస్తున్న ఆపిల్ బేర్, మల్బరీ తోటలను పరిశీలించి సాంప్రదాయ పంటలతో పాటు వైవిధ్యమైన పంటల సాగు ద్వారా ఆదాయం పెంచుకోవాలని సూచించారు. ఈ పర్యటనలో మండల ప్రత్యేక అధికారి ఇంతియాజ్ ఖాన్, ప్రధానోపాధ్యాయులు గోపి వరప్రసాద్, మెడికల్ అధికారి సంకీర్తన, ఏఈవో రమ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.