పుల్కల్ మండలంలో కలెక్టర్ విస్తృత పర్యటన
యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణ పనుల పరిశీలన
సంగారెడ్డి, జూలై 24: విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం కల్పించడానికి సంబంధిత అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ పుల్కల్ మండలంలో పర్యటించి మండల కేంద్రంలోనీ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్వాపూర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించారు.
ముందుగా బస్వాపూర్ పరిధిలో నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ పనులను పరిశీలించిన కలెక్టర్, నిర్మాణ పురోగతిపై సంతృప్తి వ్యక్తం చేశారు. పనులను నాణ్యత ప్రమాణాలతో, నిర్ణీత గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్, నూతనంగా నిర్మించిన పిహెచ్సి భవనాన్ని పరిశీలించారు.
భవనాన్ని త్వరితగతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని, త్వరగా మంత్రి చేత ప్రారంభించేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని మెడికల్ ఆఫీసర్ కు సూచించారు. అనంతరం పుల్కల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని సందర్శించిన కలెక్టర్ పాఠశాల ఆవరణ, డార్మిటరీ, తరగతి గదులు, స్టోర్రూమ్, వంటశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.
6వ తరగతి విద్యార్థినులతో ప్రత్యక్షంగా మాట్లాడిన కలెక్టర్, వారితో పాఠ్యాంశాలను చదివించి అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. విద్యార్థినులకు నోట్బుక్లను అందజేశారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని కష్టపడి చదివితే జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని వారికి ఉద్భోదించారు. కలెక్టర్ వెంట ఆయా కార్యక్రమాల్లో సంబంధిత శాఖల అధికారులు, ఎంఈ ఓ, కేజీబీవీ ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, ఇంజనీరింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.






