07-02-2026 12:00:00 AM
చర్ల, ఫిబ్రవరి 6, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని చర్ల కమ్యూనిటీ హెల్త్ సెంటర్ను జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధుల కేసులపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీల్లో భాగంగా ఓపీ విభాగం, రిజిస్ట్రేషన్ కౌంటర్, ల్యాబ్, ఇన్పేషెంట్ వార్డు, వ్యాక్సినేషన్ రూమ్, మందుల గది, డయాలసిస్ కేంద్రం తదితర అన్ని విభాగాలను జిల్లా కలెక్టర్ సమగ్రంగా పరిశీలించారు.
డయాలసిస్ కేంద్రంలో ప్రస్తుతం 23 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు సిబ్బంది జిల్లా కలెక్టర్కు వివరించారు. రోగులకు అవసరమైన వైద్య సదుపాయాలు, సేవలు ఎలాంటి అంతరాయం లేకుండా నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అటెండెన్స్ రిజిస్టర్లు, ఓపీ రిజిస్టర్లు, స్టాక్ రిజిస్టర్లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి, నిర్వహణ తీరుపై సమీక్ష నిర్వహించారు.
విధుల్లో ఉన్న మెడికల్ ఆఫీసర్తో పాటు ఇతర సిబ్బంది హాజరును కూడా పరిశీలించారు. ఆరోగ్య కేంద్రానికి వచ్చిన రోగులతో జిల్లా కలెక్టర్ నేరుగా మాట్లాడి, వారికి అవసరమైన మందులు సక్రమంగా అందుతున్నాయా లేదా అనే విషయాన్ని తెలుసుకున్నారు. అలాగే పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.
ఆరోగ్య కేంద్రంలో మందుల సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన మందుల కోసం ఒక నెల ముందుగానే మెడిసిన్ ఇండెంట్ సమర్పించాలని మెడికల్ ఆఫీసర్ను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ సాయి వర్ధన్, వైద్యులు కాంత్, రవికుమార్, నర్సులు, ఫార్మసిస్ట్తో పాటు విధుల్లో ఉన్న ఇతర సిబ్బంది పాల్గొన్నారు.