యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలి
- జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్,(విజయక్రాంతి): యువతను మత్తు పదార్థాలకు యువతను దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ పిలుపునిచ్చారు. శనివారం మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ సునీతా దేవి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీరామ్, డిసిహెచ్ శివదయాలతో కలిసి మత్తుపదార్థాల చికిత్స కేంద్రాన్ని ప్రారంభించారు. మత్తుపదార్థల చికిత్స కేంద్రం పని విధానాన్ని, ల్యాబ్ లను, కౌన్సిలింగ్ ప్రదేశాన్ని, చికిత్స విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం సూపర్డెంట్ ఛాంబర్ లో వైద్యాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ మాట్లాడుతూ.. యువతను మత్తు పదార్థాలకు దూరంగా ఉంచాలని, చెడు వ్యసనాలు అలవాటు పడిన వారిని తక్షణమే చికిత్స అందించి, సాధారణ వ్యక్తులుగా తీర్చిదిద్దాలని వైద్యులకు పిలుపునిచ్చారు. మత్తుపదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు.
మత్తు పదార్థాలు బానిసైతే జీవితాలు చీకటి మార్గం వైపు పయనిస్తాయని, అలాంటి చెడు దారిని ఎన్నుకోకుండా యువత సన్మార్గం వైపు ప్రయాణించాలన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మత్తు పదార్థాల నియంత్రణపై వైద్య విద్యార్థులకు నిర్వహించిన ఉపన్యాస, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలలో విజేతలైన విద్యార్థులకు ప్రశంసా పత్రం, షీల్డ్ ను బహుకరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ ప్రసన్నకుమార్, సిఐ మహేష్ వైద్యాధికారులు , వైద్యులు, విద్యార్థులు పాల్గొన్నారు.




