09-09-2025 12:13:04 AM
హనుమకొండ సెప్టెంబర్ 8 (విజయ క్రాంతి): హనుమకొండ జిల్లాలో ముసాయిదా ఓటర్లు, పోలింగ్ కేంద్రాల జాబితాపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 12 మండలాల్లో గ్రామ పంచాయతీల వారీగా ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితా పై అభ్యంతరాలు ఉన్నట్లయితే రాజకీయ పార్టీల ప్రతినిధులు తెలియజేయాలన్నారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి ముసాయిదా ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి 9వ తేదీన సవరించిన అనంతరం పదో తేదీన ప్రాదేశిక నియోజకవర్గాల వారీగా తుది ఓటర్ల జాబితాను ప్రదర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలో 3,70,871 మంది ఓటర్లు ఉండగా , ఇందులో మహిళా ఓటర్లు 1,90,201 ఉండగా, పురుష ఓటర్లు 1,80,666, ఇతరులు నలుగురు ఉన్నారని తెలియజేశారు.
హనుమకొండ జిల్లాలో 631 పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు ఇ.వి.శ్రీనివాసరావు, శ్యాంసుందర్, ప్రభాకర్ రెడ్డి, సయ్యద్ ఫైజుల్లా, నిశాంత్, రజనీకాంత్, ఎండి. నేహాల్, డాక్టర్ ఇండ్ల నాగేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, జయంత్ లాల్, తదితరులతోపాటు అధికారులు పాల్గొన్నారు.