calender_icon.png 2 June, 2025 | 1:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిబద్ధత గల జర్నలిస్ట్ ఎండి మునీర్

31-05-2025 10:26:21 PM

గని కార్మికుల ఘన నివాళులు..

మందమర్రి (విజయక్రాంతి): వార్తే ప్రజలు, ప్రజలే నా జీవితం అని భావించిన నిబద్ధత గల సీనియర్ జర్నలిస్టు, తెలంగాణ ఉద్యమ నేత ఎండి మునీర్ అని ఆయా కార్మిక సంఘాల నాయకులు కొనియాడారు. సింగరేణి ఏరియాలోని కేకే 5 గనిపై శనివారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మునీర్ సంతాప సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి, నివాళులు అర్పించి, రెండు నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.

అనంతరం పలువురు కార్మిక సంఘం నాయకులు మాట్లాడుతూ... బొగ్గు పేల్లకు  గొంతుక ఉంటే ముందు పిలిచే పేరు మునీర్ అని కొనియాడారు. సింగరేణిలో బొగ్గు గని  కార్మికునిగా వారి కష్టాలు కన్నీళ్లు సమస్యలు పరిష్కరించేందుకు యాజమాన్యం నిరంకుశ విధానాలపై పోరాటాలు సైతం చేసిన గొప్ప కార్మిక నాయకుడు సైతం అతనే అని తెలిపారు. సింగరేణిలో కార్మిక సంఘాల లోపాలను సైతం ఎండగట్టి, వారు కార్మికులకు ఎలా పని చేయాలో సైతం సూచించిన మార్గదర్శకుడని కొనియాడారు. 1980 ఎమర్జెన్సీ కాలంలో మందమర్రిలో దొరల భూస్వాముల దౌర్జన్యాల వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు చేసిన ఉద్యమ నాయకుడు అని, ఆ కాలంలో ప్రజలు స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్నారంటే కేవలం మునీర్ పోరాటాల వల్లనే సాధ్యమైందని తెలిపారు.

ప్రకృతికి విరుద్ధంగా బొగ్గు గనులలో పనిచేస్తూ, ప్రాణాలను పణంగా పెట్టి, నల్ల బంగారాన్ని వెలికి తీస్తున్న చీకటి సూర్యుల కన్నీటి కష్టాలను కడతెరిచేందుకు బండ కింద బ్రతుకులు అనే పేరిట సంవత్సరం కాలం పాటు ఆంధ్రజ్యోతి పత్రికలో శీర్షిక రాసిన ఏకైక జర్నలిస్టు మునీర్ అని అన్నారు. కేకే 5 గనిలో కార్మికునిగా క్లర్కుగా రెండున్నర దశాబ్దాలు  పనిచేశారని, ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రజలలో మమేకమై, ప్రజలే వార్తలుగా వార్తలే ప్రజలుగా జీవించిన ధన్యజీవి అని కొనియాడారు. ఎన్నోసార్లు మునీర్ ను దొరలు హత్య చేయించాలని చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని ప్రజలే కాపాడుకున్న చరిత్ర అతనిది అని తెలిపారు.

నాలుగు దశాబ్దాల పాటు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాల గురించి అనేక వ్యాసాలు ప్రజలను చైతన్యం చేసిన నిజమైన జర్నలిస్టు అని అన్నారు. ప్రాణాంతక వ్యాధి ఒకవైపు ప్రాణాలు తోడేస్తున్న పాలకవర్గ విధానాలను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై తన కలానికి బలంగా అని చెప్పిన ప్రజల గొంతుక సైతం అతడే అని తెలిపారు. లక్షలాది ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న గొప్ప మేధావి నల్ల బంగారు నేలలో వికసించిన విప్లవాది అని అన్నారు. స్వరాష్ట్ర సాధన కోసం సింగరేణి చీకటి సూర్యులు 35 రోజులు చేసిన సకల జనుల సమ్మె సింగరేణి జేఏసీ చైర్మన్ గా ఆయన చేసిన పోరాటం స్పూర్తి ఎందరో ఆదర్శమని తెలిపారు.

అదేవిధంగా సింగరేణి కార్మిక ఉద్యమాలతో పాటు ప్రజా పోరాటాలు సామాజిక చైతన్య ఉద్యమాలలో ఆయన చెరగని ముద్ర వేశారని కొనియాడారు. సింగరేణి ఉన్నంతకాలం ప్రతి కార్మికుడు ఆయన పేరు స్మరించుకుంటూనే  ఉంటారని అన్నారు. ఆయన ఆశయ సాధన లక్ష్యంగా, అందరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మునీర్ మిత్రుడు జి చందర్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా యూనియన్ల నాయకులు భీమానాధుని సుదర్శన్, ఓ రాజశేఖర్, కంది శ్రీనివాస్, గాండ్ల సంపత్, రాంశెట్టి నరేందర్, భీమర సదయ్య, ప్రసాద్, రామకృష్ణ లు పాల్గొన్నారు.